భారత్ నుంచి పాకిస్తాన్ కు వద్దన్నా నీళ్లు: ఈ సీజన్ లోనే కావాల్సినంత
జమ్మూ కాశ్మీర్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అనేక చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. ఫలితంగా అక్కడి ప్రధాన రిజర్వాయర్లన్నీకూడా జలకళను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రియాసి జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మించిన ప్రఖ్యాత సలాల్ డ్యామ్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల చీనాబ్ నది వరద నీటితో కళకళలాడుతోంది. సలల్ డ్యామ్ లో ఇన్ ఫ్లో పెరిగింది.
దీంతో జమ్మూ కాశ్మీర్ జలవనరుల శాఖ అధికారులు సలాల్ డ్యామ్కు చెందిన స్పిల్వే గేట్లను ఎత్తివేశారు. రిజర్వాయర్ కు వస్తున్న నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తోన్నారు. ఈ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గేట్లను ఎత్తివేశారు అధికారులు. సుమారు 80,000 నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భారత్ నుంచి పాకిస్తాన్ కు నీటిని విడుదల చేయడానికి ఉద్దేశించిన సలాల్ రిజర్వాయర్ గేట్లను ఎత్తివేయడం ఈ సీజన్ లో ఇది మూడోసారి.

డ్యామ్ గేట్లు తెరిచిన నేపథ్యంలో చీనాబ్ నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను స్థానిక యంత్రాంగం హెచ్చరించింది. నదిలో నీటి మట్టం వేగంగా పెరుగుతుండటంతో ప్రాణ నష్టం సంభవించకుండా రక్షణ చర్యలు చేపట్టారు. నది, తీర ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని అధికారులు పశువుల కాపరులు, స్థానికులకు తెలియజేశారు. నదీ తీరంలో పర్యవేక్షణ పెంచాల్సిందిగా స్థానిక పోలీసులను ఆదేశించారు.
ప్రస్తుత అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. సలాల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ స్టేషన్.. జమ్మూ కాశ్మీర్ కు అత్యంత కీలకమైన విద్యుత్ వనరు. 690 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ఈ రన్ ఆఫ్ ది రివర్ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున విద్యుత్ అందుతోంది. అధిక వర్షాల వల్ల వరద నీటితో పాటు కొండ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బురద, ఇతర వ్యర్థాల వల్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తోన్నారు.
కాగా.. ఈ నీరు మొత్తం కూడా పాకిస్తాన్ కు చేరుతుంది. సింధు జలాల ఒప్పందంలో చీనాబ్ నది కీలకం. ఈ ఒప్పందం పరిధిలోకి వచ్చే చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ రిజర్వాయర్ గతంలోనూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సాగు నీటి అవసరాల కోసం పాకిస్తాన్ ఈ నది ప్రవాహంపైనే ఎక్కువగా ఆధారపడుతుంటుంది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల నీటి వినియోగ హక్కులను భారత్, పాకిస్తాన్ మధ్య విభజించారు.
#WATCH | Reasi, Jammu-Kashmir: All gates of the Salal Dam have been opened following a sharp rise in water inflow into the reservoir due to heavy rainfall in the upper catchment areas. The increased discharge has led to a rise in the Chenab River’s water level and flow… pic.twitter.com/OIIThlLyPM
— ANI (@ANI) August 23, 2026
సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాక్ స్వస్తి పలికే వరకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ గత ఏడాది ప్రకటించింది. నీటి మట్టం భారీగా పెరగడంతో అదనపు జలాలను విడుదల చేయక తప్పట్లేదు. ఇదివరకు ఇదే చీనాబ్ నదిపై ఎగువన నిర్మించిన బగ్లిహార్ డ్యామ్ గేట్లను కూడా అధికారులు ఎత్తివేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కు ఈ నీటి విడుదల అంతా అనధికారికమే.












Click it and Unblock the Notifications