ఆర్కే నగర్ ఉపఎన్నిక: 'అమ్మ' మెజారిటీపై ధీమా..!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోసం ఖాలీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ స్ధానం నుంచి అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
జయలలితపై పోటీ చేసేందుకు ప్రతిపక్షం సహా ప్రధాన పార్టీలన్నీ వెనకడు వేశాయి. అంటే దీని అర్ధం డీఎంకే, కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు ఈ ఉప ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో వామపక్షాల అభ్యర్ధి సి. మహేంద్రన్ సహా 27 మంది ఇండిపెండెంట్లు మాత్రమే బరిలో ఉన్నారు.
ప్రతిపక్షాలకు దిమ్మదిరిగేలా తనకు భారీ మెజారిటీ కట్టబెట్టాలని జయలలిత ఆర్కేనగర్ ఓటర్లను కోరారు. నియోజకవర్గంలో మొత్తం 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిల్లో 22 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆర్కేనగర్ నియోజకవర్గంలో మొత్తం 2,43, 241 మంది ఓటర్లు ఉన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, పార్టీ చిహ్నాలతోపాటు వారి ఫొటోలను కూడా అమర్చారు. ఈ ఉప ఎన్నికసాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుంది.
ఉప ఎన్నిక ఫలితాలను ఈనెల 30న ప్రకటించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో జయలలిత విజయం ఖాయమైనప్పటికీ, అమ్మ మెజార్టీపైనే చర్చ కొనసాగుతోంది.