బీఎండబ్ల్యూ కారుతో మూడుసార్లు తొక్కించి.. సీఎం సమీప బంధువు దారుణ హత్య
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారుతో మూడుసార్లు తొక్కించడంతో ఆయనపై తీవ్రంగా గాయపడి మరణించారు.
చండీగఢ్: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ సమీప బంధువును అతని స్నేహితులు దారుణంగా చంపారు. బీఎండబ్ల్యూ కారుతో మూడుసార్లు తొక్కించడంతో ఆయనపై తీవ్రంగా గాయపడి మరణించారు. ఈ దారుణం చండీగఢ్ లో జరిగింది.
వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ కు మేనల్లుడు ఆకాంశ్ సేన్(28) బుధవారం అర్ధరాత్రి లేట్ నైట్ పార్టీలో పాల్గొన్నాడు. గురువారం తెల్లవారుజామున పార్టీలో స్నేహితులతో గొడవ పడ్డాడు.
ఇద్దరు స్నేహితులు.. ఆకాంశ్ ను కొట్టి, బీఎండబ్ల్యూ కారును అతడిపై నుంచి మూడుసార్లు పోనిచ్చారు. ఈ ఘటనలో ఆకాంశ్ ను కారు 50 మీటర్ల దూరం లాక్కెళ్లింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆకాంశ్ ను అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు.
తీవ్రంగా గాయపడిన ఆకాంశ్ ను చాలా ఆలస్యంగా గుర్తించారు. శుక్రవారం చండీగఢ్ లోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ హత్య కేసులో నిందితులను హర్మితాబ్ సింగ్ ఫరీద్, బలరాజ్ సింగ్ రంధావాలుగా గుర్తించామని, ప్రస్తుతం వీరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
మరోవైపు పోలీసుల విచారణ తీరుపై వీరభద్ర సింగ్ కుటుంబ సభ్యులు విమర్శించారు. హత్య జరిగి 24 గంటలు గడిచినా పోలీసులు నిందితులను అరెస్టు చేయాలేదని వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ ఆరోపించారు.
సీఎం వీరభద్ర సింగ్ మాట్లడుతూ... తాను పంజాబ్ గవర్నర్ తో మాట్లడానని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరానని, నిందితులు దేశం విడిచి పారిపోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పానని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని చండీగఢ్ వచ్చారు.