క్లీన్ స్వీప్ - చరిత్రలో లేని విధంగా మారిన కేరళ ఓటర్ సరళి!
దశాబ్దాల ఆచారాన్ని తిరగరాస్తూ 2021లో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF)కు 2026 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? తాజా సర్వే గణాంకాలు అవుననే అంటున్నాయి. మల్టీసోర్స్ న్యూస్–సి ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన భారీ ఎగ్జిట్ పోల్/అభిప్రాయ సేకరణలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నట్లు వెల్లడైంది. దాదాపు 90 వేల మంది అభిప్రాయాలను సేకరించి రూపొందించిన ఈ నివేదిక కేరళ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 71. సర్వే అంచనాల ప్రకారం.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 69 నుంచి 81 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. మరోవైపు, ప్రస్తుత అధికార పక్షం ఎల్డీఎఫ్ 57 నుంచి 69 స్థానాలకే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన ఎన్డీఏ (NDA), ఈసారి 1 నుంచి 5 స్థానాల వరకు తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 2021లో 99 స్థానాలతో విరాజిల్లిన ఎల్డీఎఫ్, ఇప్పుడు ఓట్ల క్షీణతతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ప్రాంతాల వారీగా విశ్లేషణ: ఎక్కడెవరు బలంగా ఉన్నారు?
దక్షిణ కేరళ:
ఈ ప్రాంతం ఇప్పటికీ ఎల్డీఎఫ్కు కంచుకోటగానే ఉంది. తిరువనంతపురం (8-10 సీట్లు), అలప్పుజ (6-8 సీట్లు) జిల్లాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే, పతనంతిట్టలో యూడీఎఫ్ అనూహ్యంగా పుంజుకోవడం ఎల్డీఎఫ్కు ఆందోళన కలిగించే అంశం. ఇక్కడ ఎన్డీఏ కూడా కొన్ని నియోజకవర్గాల్లో (ముఖ్యంగా కజకూట్టం, నేమం) గట్టి పోటీ ఇస్తోంది.
మధ్య కేరళ:
గతంలో ఎల్డీఎఫ్ పట్టు సాధించిన ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా యూడీఎఫ్ వైపు మళ్లింది. ఎర్నాకులం, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో యూడీఎఫ్ క్లీన్ స్వీప్ చేసే దిశగా ఉంది. ఎర్నాకులంలో యూడీఎఫ్ 12-14 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే చెబుతోంది.
ఉత్తర కేరళ:
కన్నూర్, కాసరగోడ్ వంటి లెఫ్ట్ కోటలను ఎల్డీఎఫ్ కాపాడుకుంటున్నప్పటికీ, మలప్పురం మరియు వైనాడ్లలో యూడీఎఫ్ తన పట్టును మరింత బిగించింది. ముఖ్యంగా మలప్పురంలో యూడీఎఫ్ 14-16 స్థానాల్లో జయకేతనం ఎగురవేయనుంది.
కీలక నియోజకవర్గాల్లో హోరాహోరీ
ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ప్రాబల్యం ఫలితాలను శాసించనుంది. తిరువనంతపురంలో వి. మురళీధరన్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి ఉద్ధండులు బీజేపీ తరపున గట్టి పోటీ ఇస్తుండగా, ఎల్డీఎఫ్ మంత్రులు పి. రాజీవ్, కే.ఎన్. బాలగోపాల్ వంటి వారు తమ స్థానాల్లో స్వల్ప ఆధిక్యంతో పోరాడుతున్నారు. పాలక్కాడ్లో రమేష్ పిశారోడి, అదూర్లో సి.వి. శాంతాకుమార్ వంటి యూడీఎఫ్ అభ్యర్థులు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన అస్త్రం?
ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో పెరిగిన అసంతృప్తి, ప్రాంతాలవారీగా మారిన ఓటింగ్ సరళి యూడీఎఫ్కు వరంగా మారినట్లు కనిపిస్తోంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు మూడు విడతలుగా నిర్వహించిన ఈ సర్వే, కేరళలో ఈసారి 'పాలన మార్పు' (Power Shift) ఖాయమని సంకేతాలిస్తోంది. అయితే, స్వల్ప మెజారిటీలతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉన్నందున, 2026 పోరు కేరళ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.












Click it and Unblock the Notifications