సిడబ్ల్యుసి కీలక భేటీ - ఎన్నికల షెడ్యూల్ ఖరారు : ఆజాద్ ఎఫెక్ట్..!!
కాంగ్రెస్ పార్టీ అత్యున్నత మండలి వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది. పార్టీలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారుతోంది. విదేశాల్లో చికిత్స కోసం వెళ్లిన సోనియా గాంధీ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశం ముగిసిన వెంటనే పార్టీ నేతలు అధికారికంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నారు.
Recommended Video
ఈ సాయంత్రం షెడ్యూల్ ప్రకటన
కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అధారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రి 4.30 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ గత అక్టోబర్ లోనే ఈ ఏడాది ఆగస్టు 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 20 మధ్య అధ్యక్ష ఎన్నికల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి షెడ్యూల్ పైన అధికారికంగా ఆమోద ముద్ర పడనుంది. 2019 ఎన్నికల్లో పార్టీ పరాజయం తరువాత రాహుల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా కొనసాగుతున్నారు. జీ 23 నేతల తిరుగుబాటు తరువాత సోనియా సైతం పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొనేందుకు సిద్దమయ్యారు.
గాంధీ ఫ్యామిలీ నుంచే అవుతారా
అయితే, పార్టీ సీనియర్లు సోనియాను కొనసాగాల్సిందిగా అభ్యర్ధించారు. ఇక, ఇప్పుడు పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసారు. ఆయనతో జీ 23 నేత ఆనంద్ శర్మ పార్టీ వీడిన ఆజాద్ తో భేటీ అయ్యారు. జమ్ము కాశ్మీర్ క చెందిన పలువురు నేతలు ఆజాద్ బాటలో పార్టీని వీడారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఖాన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసారు. గాంధేయతర నాయకుడు ఈ సారి కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతారని చెబుతున్నారు. అందులో ఖర్గే.. రాజస్థాన్ సీఎం గెహ్లాట్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ, గెహ్లాట్ వంటి నేతలు మాత్రం తనతో పార్టీ అధ్యక్ష బాధ్యతల అంశం పైన చర్చకు రాలేదని స్పష్టం చేసారు.
యాత్రకు రాహుల్.. ప్రియాంక కీలక పాత్ర
రాహుల్ గాంధీ పార్టీ బాధ్యతలు స్వీకరించాలని కోరుతున్నారు. గాంధీ కుటుంబానికి మద్దతుగా ఉన్న నేతలు మాత్రం గాంధీ కుటుంబం నుంచే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొనసాగాలని కోరుతున్నారు. ఇదే అంశం పైన ఈ రోజున జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించనున్నారు. నెల రోజుల్లోగా పార్టీ అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక, సెప్టెంబర్ 7వ తేదీ నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో ప్రియాంక గాంధీ పార్టీలో యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు.. ఎన్నికల అంశం పైన ఈ రోజున జరిగే సమావేశం లో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది.