లాక్డౌన్లో మోదీ తొలిసారి.. అంపన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రధాని.. బెంగాల్, ఒడిశాకు భారీ ప్యాకేజీ?
భారత్ ఎదుర్కొన్న అతిభారీ ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిన అంపన్ పెను తుపాను వెస్ట్ బెంగాల్, ఒడిశాలో బీభత్సం సృష్టించింది. బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, 185 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీయడంతో సర్వం కొట్టుకుపోయి.. ఆ రెండు రాష్ట్రాల్లో 84 మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో జనం గాయపడ్డారు. భారీ ఎత్తున పంటలు, ఆస్తి నష్టం సంభవించింది. పెను తుపానుతో దెబ్బతిన్న బెంగాల్, ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించనున్నారు.

మోదీ నిర్దేశం..
వెస్ట్ బెంగాల్, ఒడిశాలో అంపన్ పెను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన మోదీ శుక్రవారం పర్యటిస్తారని, ఏరియల్ సర్వే ద్వారా తుఫాను నష్టాన్ని అంచనా వేసి.. రెండు రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రధాని కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తపాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నట్లు ప్రకటించింది.

రెండు నెలల తర్వాత తొలిసారి..
కరోనా లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలలుగా ఢిల్లీకి మాత్రమే పరిమితమైన ప్రధాని మోదీ.. రాష్ట్రాల సందర్శనకు రానుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఏరియల్ సర్వే తర్వాత బెంగాల్, ఒడిశా ముఖ్యమంత్రులు, కీలక అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ బాధ్యులతో ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమావేశంలో రెండు రాష్ట్రాలకు భారీ సహాయక ప్యాకేజీని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేసిన కొద్దిసేపటికే ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన వెలువడటం గమనార్హం.

బెంగాల్ ఆగమాగం..
అంతకుముందే ట్విటర్ లో అంపన్ విలయంపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ కష్టకాలంలో యావత్ దేశం మీకు తోడుగా ఉంటుందని బెంగాల్, ఒడిశాలకు బరోసా కల్పించారు. అంపన్ కారణంగా ఒక్క బెంగాల్ లోనే 72 మంది చనిపోయినట్లు సీఎం మమత తెలిపారు. అందులో 15 మంది కోల్ కతా వాసులేనని, సిటీతోపాటు తీరప్రాంతాల్లోని గ్రామాలన్నీ దాదాపుగా ధ్వంసమయ్యాయని తెలిపారు. దాదాపు దశాబ్ధం తర్వాత బెంగాల్ కు తీవ్ర నష్టం చేకూర్చిన తుపాను అంపనే అని ఆమె చెప్పారు.

ఇప్పట్లో కోలుకోలేదు..
తుపాను తీరం దాటకముందు నుంచే ప్రభావిత ప్రాంతాల్లో మోహరించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. శక్తికి మించి సహాయక కర్యక్రమాలు చేపట్టాయి. ఎన్డీఆర్ఎఫ్ చీఫ్ ఎస్డీ ప్రధాన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అంపన్ ప్రభావం ఒడిశాలో కంటే బెంగాల్ లోనే తీవ్రంగా ఉందన్నారు. ఒడిశాలో తీరప్రాంతాల్లోని 1.50లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరించామని, ఒకటి రెండు రోజుల్లో అక్కడ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. అయితే బెంగాల్ లో మాత్రం భారీగా 5లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించామని, అక్కడ ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితులు లేవని అన్నారు.












Click it and Unblock the Notifications