ఈ జిల్లాల్లో రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు
Cyclone Dana: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది. అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 24 గంటల వ్యవధిలో క్రమంగా వాయుగుండంగా అనంతరం అతి తీవ్ర తుఫాన్గా ఆవిర్భవించనుంది. దీని ప్రభావం ఏపీ సహా ఏకంగా మూడు రాష్ట్రాలపై ఉండబోతోంది.
బంగాళాఖాతం తూర్పు- మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ ఉత్తర తీరంంలో ఈ నెల 19వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఇది అల్పపీడనంగా మారినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించిది. నేటి నుంచి దీని కదలికలు చురుగ్గా ఉంటాయని పేర్కొంది.

వాతావరణ కేంద్రం వేసిన అంచనాల ప్రకారం- క్రమంగా ఈ అల్పపీడనం బంగాళాఖాతం మధ్య ప్రాంతానికి కదులుతుంది, అక్కడ వాయుగుండంగా మారుతుంది. అనంతర అతి తీవ్ర తుఫాన్గా ఆవిర్భవిస్తుంది. దీనికి దానా అని ఇదివరకే పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఖతర్ ఈ పేరును సూచించింది.
దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి. ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉంది. గురువారం అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారు జామున తీరం తాకుతుంది.
దీని ప్రభావం వల్ల బుధవారం నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రత్యేకించి ఒడిశాలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అక్కడ సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడుతున్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ రంగంలోకి దిగారు. అధికార యంత్రాంగంతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. తుఫాన్ వల్ల ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను తీర ప్రాంత జిల్లాల్లో మోహరింపజేయాలని అన్నారు.
సహాయ, పునరావాస శిబిరాల్లో తలదాచుకునే వారికి ఎలాంటి లోటు రానివ్వకూడదని మాఝీ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలను పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఆసుపత్రులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందేలా చూడాలని అన్నారు. మత్స్యకారులెవరూ సముద్రంపై చేపలవేటకు వెళ్లకూడదని కోరారు.
కాగా- గంజాం, పూరీ, జగత్సింగ్ పూర్, కేంద్రాపారా, భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, కియొంఝర్, ఢెంకనాల్, జైపూర్, అంగుల్, ఖుర్దా, నయాగఢ్, కటక్ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవును ప్రకటించింది ప్రభుత్వం. బుధవారం నుంచి మూడు రోజుల పాటు అంటే 25వ తేదీ వరకు సెలవు ఉంటుంది.












Click it and Unblock the Notifications