ఒడిశాపై 'ఫొని' పంజా.. తీరం అల్లకల్లోలం.. భయాందోళనలో జనం..
భువనేశ్వర్ : మూడు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఫొని ఒడిశాలోకి ప్రవేశించింది. ఉదయం 8 గంటల సమయంలో ఫొని రాష్ట్రాన్ని తాకినట్లు అధికారులు ప్రకటించారు. పెనుగాలులు, అతి భారీ వర్షాలతో ఫొని తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఏపీ తీరాన్ని దాటిన తుఫాను ఉ.10.30గం. నుంచి 11.30గం. మధ్య గోపాల్పూర్ చాంద్బలీ మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను పెను విధ్వంసం సృష్టించే అవకాశమున్నందున ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు.
ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర! ముప్పు తప్పినట్టేనట్టేనా?: తీర గ్రామాలు అల్లకల్లోలం
ఒడిశాలో ఫొని బీభత్సం
ఫొని దెబ్బకు ఒడిశా చిగురుటాకులా వణుకుతోంది. 1999లో 10వేల మంది ప్రాణాలు బలిగొన్న సూపర్ సైక్లోన్ అనంతరం ఇంత భారీ స్థాయిలో తుఫాను విపత్తు ఎదురుకావడం ఒడిశాకు ఇదే తొలిసారి. ప్రస్తుతం ఫొని ఒడిశా తీరానికి చేరువకావడంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. పెనుగాలులతో పాటు, అతి భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
పెను గాలులు, అతిభారీ వర్షాలు
తుఫాను కారణంగా గోపాల్పూర్, పూరీ, భువనేశ్వర్, పారాదీప్, చాంద్బాలీ, కళింగపట్నంలో పెను గాలులతో పాటు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గజపతి, గంజా, కుర్దా, పూరీ, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపరా, జాజ్పూర్, భద్రక్, బాలాసోర్ జిల్లాలపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
సురక్షిత ప్రాంతలకు తరలింపు
భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్పోర్స్, కోస్ట్ గార్డ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రధాని మోడీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
147 రైళ్లు రద్దు
ఫొని ప్రభావంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు సర్వీసులు రద్దు చేసింది. దాదాపు 147 రైళ్లను మే 4వ తేదీ వరకు నిలిపివేసింది. టూరిస్టుల కోసం పూరీ, హౌరా, బెంగాల్లోని షాలిమార్ మధ్య మూడు ప్రత్యేక ట్రైన్లు నడపాలని అధికారులు నిర్ణయించారు.