నెలకొరిగిన 10 వేల కరెంట్ స్తంభాలు, 30 లక్షల కుటుంబాలకు అంధకారం : ఇదీ ఒడిశాపై ఫణి ఎఫెక్ట్
భువనేశ్వర్ : ఒడిశాఫై ఫణి రక్కసి తీరని గాయం చేసింది. సూపర్ సైక్లోన్ బీభత్సంతో మృతుల సంఖ్య 12కి చేరింది. తుఫాను సృష్టించిన విలయ తాండవంతో రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 వేల గ్రామాలు, పట్టణాల్లో పునరావాస చర్యలను అధికారులు చేపట్టారు.
పూరీపై ఎఫెక్ట్ ఎక్కువే ...
ఫణి తుఫాన్ ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీపై ఎక్కువగా ఉంది. 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయడంతో ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. నిన్న 8 మంది చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించగా .. ఇవాళ బరిపద జిల్లాలో మరో నలుగురు భారీ వృక్షాల కింద పడి మృతిచెందినట్టు గర్తించామని పేర్కొన్నారు.
అండగా ఉంటాం ...
ఒడిశాపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో .. సీఎం నవీన్ పట్నాయక్తో ప్రధాని మోదీ మాట్లాడారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, సహాయక చర్యలపై చర్చించారు. ఒడిశాను అన్నివిధాలా ఆదుకుంటామని ప్రధాని మోదీ భరోసా కల్పించారు. ఒడిశా వెంటే యావత్ జాతి నిలుస్తోందని ఆ తర్వాత ట్వీట్ కూడా చేశారు మోదీ.
పునరావాస చర్యలు ...
తుఫాన్ బీభత్సంతో నిన్న అధికారులతో సీఎం నవీన్ పట్నాయక్ సమీక్షించారు. పూరీ జిల్లాపై ఎక్కువగా ప్రభావం చూపిందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని .. మరమ్మతు ప్రక్రియ చేపడుతున్నట్టు వివరించారు. విద్యుత్ సరఫరా చేసేందుకు వందల మంది ఇంజినీర్లు, టెక్నిషీయన్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాగే భారీ వృక్షాలు నేలకొరగడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని తెలిపారు.
నిలిచిన విద్యుత్ సరఫరా ...
ఎన్డీఆర్ఎఫ్, ఒడిశా డిజాస్టర్ రాపిడ్ ఫోర్స్, ఫైర్ సర్వీసెస్ విభాగాలు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం కోసం శ్రమిస్తున్నారు. తుఫాను ప్రభావంతో 30 లక్షల మంది కుటుంబాలకు అంధకారం నెలకొందని అధికారులు వివరిస్తున్నారు. ముఖ్యంగా తీరప్రాంతాల ప్రజలే ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఒక్క భువనేశ్వర్లోనే 10 వేల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. దీంతో విమానాశ్రయం, రైల్వే, హాస్పిటళ్లకు విద్యుత్ అందించడం కష్టమవుతోందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 25 శాతం పునరుద్ధరణ పనులు ఆదివారం వరకు పూర్తవుతాయి. పూరీ, కుర్దా గంజం జగత్ సింగ్ పూర్, కేంద్రపర, బాలాసోర్ జిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగగా .. వెంటనే క్విక్ యాక్షన్ టీం స్పందించి చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావంతో యాసంగి పంట, మొక్కలకు నష్టం వాటిల్లింది. చెన్నై హౌరా మధ్య నడిచే 220 రైళ్ల రాకపోకలను నిషేధించారు.
సురక్షిత ప్రాంతాలకు తరలింపు
తుఫానుతో 12 లక్ష మంది ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించినట్టు సీఎం కార్యాలయవర్గాలు పేర్కొన్నాయి. వీరు దాదాపు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలకు చెందిన వారని వివరించారు. మొత్తం 4 వేల షెల్టర్లు, 880 ప్రత్యేక తుఫాను ప్రభావిత కేంద్రాల ద్వారా బాధితులకు పునరావాసం కల్పించినట్టు తెలిపారు. అలాగే వారికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించినట్టు తెలిపారు.