Cyclone Jawad: తీరానికి దూసుకొస్తోన్న పెను తుఫాన్: తిత్లి, ఫైలీన్ కలిపితే జవాద్
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన జవాద్ తుఫాన్.. తీరానికి తరుముకొస్తోంది. ఏపీ-ఒడిశా మధ్య తీరాన్ని దాటనుంది. ఇదివరకు ఉత్తరాంధ్రను వణికించిన హుద్హుద్, ఫైలీన్, తిత్లి కంటే దీని తీవ్రత అధికంగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఏపీ ఉత్తర ప్రాంతం-ఒడిశా దక్షిణ తీరం మధ్య, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరి వద్ద ఈ జవాద్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని గుర్తించారు. తీరాన్ని దాటే సమయంలో 90 నుంచి 100 కిలోమీటర్లు, అంతకంటే బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుఫాన్ తాజా కదలిక..
జవాద్ తుఫాన్ వేగంగా కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాత్రి 11:30 గంటల సమయానికి అది బంగాళాఖాతంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒడిశాలోని పూరికి పశ్చిమ మధ్య దిశగా 430 కిలోమీటర్లు, పారాదీప్కు నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో అది తీరం వైపునకు కదులుతున్నట్లు తెలిపారు. క్రమంగా పూరీ వైపునకు దూసుకొస్తుందని, అనంతరం దక్షిణ పశ్చిమ బెంగాల్ వైపు వెళ్తుందని పేర్కొన్నారు.
మూడు రాష్ట్రాలపై..
ఏపీ, ఒడిశా సహా పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఈ మూడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అర్ధరాత్రి నుంచి ఒడిశాలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. నవరంగ్ పూర్, బ్రహ్మపూర్, పూరీ, కటక్, భువనేశ్వర్, కేంద్రపారా, జగత్సింగ్ పూర్, గంజాం, గోపాల్పూర్, ఏపీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పశ్చిమ బెంగాల్లో ఈస్ట్ మేదినిపూర్, దక్షిణ 24 పరగణా, కోల్కత, దుర్గాపూర్ జిల్లాల్లో హైఅలర్ట్ను ప్రకటించారు.
పాఠశాలలు బంద్
జవాద్ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. ఒడిశా ప్రభుత్వం.. శనివారం పాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, మాస్ ఎడ్యుకేషన్ సెంటర్లు, ఇన్స్టిట్యూషన్లకు సెలవు ఇచ్చింది. 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగులు, చెట్లు నేల కూలే ప్రమాదం ఉందని, అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది.
తీర ప్రాంత గ్రామాల్లో భారీగా మోహరింపు
జవాద్ తుఫాన్ను తీరాన్ని దాటనున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఒడిశా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ను రంగంలోకి దింపింది. ఈ రెండు బలగాలకు చెందిన చెందిన 247 బృందాలను తీర ప్రాంత జిల్లాలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాల్లో సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించిన ప్రత్యేకాధికారి ప్రదీప్ కుమార్ జెనా తెలిపారు. ముందస్తు చర్యగా దీనికి అదనంగా మరో 20 బృందాలను సిద్ధంగా ఉంచుకున్నామని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించడంపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు.
Recommended Video
ఏపీలో
ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా తీర ప్రాంతాలపై జవాద్ తుఫాన్ ప్రభావం చూపనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 51 వేల మంది తీర గ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశానికి తరలించారు అధికారులు. ఇప్పటిదాకా శ్రీకాకుళం-15,755, విజయనగరం-1,700, విశాఖపట్నం- 36,553 మందిని షిఫ్ట్ చేశారు. తరలింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 197 ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరింపజేశారు. యూజీసీ-నెట్ పరీక్షలను ఒడిశా, ఏపీ ప్రభుత్వాలు వాయిదా వేశాయి. వాటిని రీషెడ్యూల్ చేశాయి.