నలుగుర్ని బలిగొన్న వార్దా తుఫాను: అప్రమత్తమైన రైల్వేశాఖ
చెన్నైని అతలాకుతలం చేస్తోన్న వార్దా తుఫాను ఇద్దరిని బలిగొంది.
చెన్నై: వార్దా తుఫాను తమిళనాడును అతలాకుతలం చేస్తోంది. గంటకు 150కి.మీ వేగంతో వీస్తున్న బలమైన ఈదురు గాలులకు వర్షం కూడా తోడవడంతో చెన్నై మళ్లీ చివురుటాకులా వణికిపోయే పరిస్థితి వచ్చింది. రోడ్ల పక్కనున్న చెట్లు విరిగిపడుతుండటం.. కరెంట్ స్తంభాలు సైతం పడిపోయే అవకాశముండటంతో.. ప్రజలను బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు చేసింది.
కాగా, వర్ష భీభత్సానికి ఇప్పటికే నలుగురు మృత్యువాత పడటం గమనార్హం. సముద్రం తీవ్రంగా ఉప్పొంగుతుండటంతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న ప్రభుత్వం.. తుఫాన్ తాకిడిని తట్టుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

పునరావాస కేంద్రాల్లో పంపిణీ చేయడానికి ఆహార పదార్థాలను కూడా సిద్దం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు రైళ్ల రాకపోకలను నిలిపివేయగా.. విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఏపీలోని దక్షిణ కోస్తాపై వార్దా ప్రభావం పడే అవకాశం ఉండటంతో.. నెల్లూరులో వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి తిరుపతిలో ఆకాశం మేఘావృతమై ఉంది.
రైల్వే శాఖ అప్రమత్తం:
వార్దా తుఫాన్ ప్రభావంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. చెన్నై మార్గంలో వెళ్లే పలు రైళ్లను ఇప్పటికే రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. ప్రయాణికుల సహాయార్దం ప్రధాన రైల్వే స్టేషన్లలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
విజయవాడ-చెన్నై మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు దారి మళ్లించగా, నెల్లూరు - చైన్నై మధ్య రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
హెల్ప్లైన్ నంబర్లు:
* విజయవాడ 0866- 248800, 2575038, 1072
* నెల్లూరు- 0861 2345864, 7702774104, గూడూరు- 9604506841












Click it and Unblock the Notifications