Blood Moon చంద్రగ్రహణం..భీకర తుఫాన్: ఒకేరోజు జాయింట్గా: దేనికి సంకేతం: ఎన్నో అనుమానాలు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కమ్మేసింది. వైద్య రంగాన్ని పెను సంక్షోభంలోకి నెట్టేసింది. ఏ రాఫ్ట్రం కూడా దీనికి మినహాయింపు కాదు. పలు రాష్ట్రాల్లో కరోనా సృష్టించిన విధ్వంసకర పరిస్థితులు కనిపిస్తోన్నాయి. కరోనా ధాటికి లక్షలాది మంది అనారోగ్యం పాలయ్యారు. మూడు లక్షల మందికి పైగా మృత్యువాత పడ్డారు. పేషెంట్లకు చికిత్సను అందించడానికి ఆసుపత్రులు చాలట్లేదు. పడకలు సరిపోవట్లేదు. ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. ఈ పరిణామాల మధ్య ఈ నెల 26వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం అది.
Recommended Video
ఏఏ దేశాల్లో కనిపిస్తుందంటే..
బుధవారం చంద్రుడు.. భూమికి దగ్గరగా వస్తాడు. సాధారణ రోజుల్లో కంటే పెద్దగా కనిపిస్తాడు. ఎరుపు, నారింజ రంగుల మిశ్రమంలో కనిపించడం వల్ల దీనికి సూపర్ బ్లడ్ మూన్ (Super Blood moon), రెడ్ మూన్ (Red Moon)గా పేరు పెట్టారు. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా పశ్చిమ ప్రాంత రాష్ట్రాలు, దక్షిణ అమెరికాలోని కొన్ని చోట్ల, ఆసియా ఈశాన్య ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఆసియా, ఆస్ట్రేలియా, సముద్రతీర ప్రాంత దేశాలు, అలస్కా, కెనడా, హవాయ్, మెక్సికో, సెంట్రల్ అమెరికా, దక్షిణ అమెరికా దేశాల్లో చంద్రగ్రహణం పాక్షికంగా దర్శనమిస్తుంది.
అయిదు గంటలకు పైగా
భారత్లో పాక్షికంగా మాత్రమే దీన్ని చూడొచ్చు. ఈ అవకాశం దేశం మొత్తానికీ లేదు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు వాటికి ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్లోనూ పాక్షికంగా చంద్రగ్రహణం దర్శనమిస్తుంది. 2019 జనవరిలో తరువాత ఏర్పడబోతోన్న తొలి సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే. కోఆర్డినేటెడ్ యూనివర్స్ టైమ్ (UTC time zone) ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల 47 నిమిషాల 39 సెకెన్లకు ఈ చంద్రగ్రహణం ఆరంభం కాబోతోంది. మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల 44 సెకెన్లకు ముగుస్తుంది. మొత్తంగా అయిదు గంటలా రెండు నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉంటుందిది. పాక్షిక గ్రహణ కాలం దీనికి సగమే. అంటే 2 గంటల 53 నిమిషాల 14 సెకెన్ల పాటు కొనసాగుతుంది.
అదే రోజు పెను తుఫాన్..
ఈ గ్రహణం సంభవించే రోజే.. యాస్ తుఫాన్ (Cyclone Yaas) తీరాన్ని దాటబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాతావరణ శాఖ వేసిన తాజా అంచనాల ప్రకారం.. బుధవారం సాయంత్రం యాస్ తుఫాన్ ఒడిశాలోని పారాదీప్, పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలండ్ మధ్య తీరాన్ని దాటుతుంది. తీరాన్ని దాటే సమయంలో 160 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయనే అంచనాలు ఉన్నాయి. తుఫాన్ ప్రభావం వల్ల మంగళవారం సాయంత్రం నుంచి ఉత్తరాంధ్ర సహా ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.
తీరాల్లో అల్లకల్లోలం..
పూరీ, జగత్సింగ్పూర్, ఖుర్దా, కటక్, కేంద్రపారా, జైపూర్, భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్, ఢెంకనాల్, కియొంఝర్, అంగుల్, దేవ్గఢ్, సుందర్గఢ్, పశ్చిమ బెంగాల్లోని మేదినిపూర్, దక్షిణ 24 పరగణ, హౌరా, హుగ్లీ, ఉత్తర 24 పరగణ, పురూలియా, బాంకురా, బర్ధమాన్, కోల్కత, బీర్భూమ్, నాదియా, ముర్షీదాబాద్లల్లో ఈ నెల 26వ తేదీ వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తోన్నారు. తుఫాన్ ప్రభావంతో బెంగాల్లోని మాల్దా, డార్జిలింగ్, దినాజ్పూర్, కలింపాంగ్, జల్పాయ్గురిల్లో సైతం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
పౌర్ణమి నాడు పోటెత్తే సముద్రానికి తుఫాన్ కూడా తోడైతే..
చంద్రగ్రహణం, భీకర తుఫాన్ ఒకేరోజు రావడం పట్ల భయాందోళనలు కూడా వ్యక్తమౌతోన్నాయి. సాధారణంగా పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తుతుంటుంది. అది సహజం. అలాంటిది వైశాఖ పౌర్ణమి నాడు చంద్రుడు భూమికి మరింత దగ్గరగా రావడం, సాధారణ పున్నమిరోజుల కంటే మరింత పెద్దగా కనిిపించడం వల్ల సముద్రం మరింత భీకరంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో తుఫాన్ కూడా విరుచుకుపడబోతోండటం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళన తీర ప్రాంత ప్రజల్లో నెలకొని ఉంది. అసలే కరోనా మహమ్మారి కమ్ముకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రకృతి విపత్తు ముంచుకురావడం మరింత విలయానికి కారణమౌతందునే అభిప్రాయాలు సాధారణ ప్రజల్లో లేకపోలేదు.