నాన్నకు ఫుల్ మార్కులు వేస్తా: జైట్లీ కూతురు
న్యూఢిల్లీ: తన తండ్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన కేంద్ర ఆర్థిక బడ్జెట్కు పూర్తి మార్కులు వేస్తానని ఆయన కూతురు సోనాలి అన్నారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచే విధంగా బడ్జెట్ ఉందని ఆయన అల్లుడు అభిప్రాయపడ్డారు. కేటాయింపుల పెంపుపై ప్రధానంగా దృష్టి సారించారని చెప్పారు.
అరుణ్ జైట్లీ బడ్జెట్పై బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా సంతృప్తి వ్యక్తం చేశారు. జైట్లీ పరీక్ష పాసయ్యారని, ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత కేటాయించారని ఆయన అన్నారు. రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా కేటాయించడం బడ్జెట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని కేంద్ర రోడ్లు, రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన బడ్జెట్ గొప్పగా ఉందని, దేశాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా ఉందని కేంద్ర విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అయితే, కాంగ్రెసు నేతలు మాత్రం బడ్జెట్ను విమర్శించారు.
బడ్జెట్లో ఏం చేయాల్సిన అవసరం ఉందో అది చేయలేదని కాంగ్రెసు సీనియర్ నేత కమల్నాథ్ అన్నారు. కుంగిపోతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే విధంగా లేదని, అలంకారప్రాయంగా ఉదని కాంగ్రెసు నేత మనీష్ తివారీ అభిప్రాయపడ్డారు.