కర్ణాటకలో భారీ వర్షాలు, విద్యాసంస్థలు బంద్, పర్యాటకులకు ఇబ్బంది, బెంగళూరులో!
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలోని కరావళి (కోస్తా ప్రాంతం)లో భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జూన్ 8, 9వ తేది దక్షిణ కన్నడ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల మధ్యలో బెంగళూరులో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారుగా వర్షం పడింది.
గురువార రాత్రి నుంచి దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం దక్షిణ కన్నడ జిల్లా మొత్తం వర్షాలు పడ్డాయి. వర్షం నీరు రోడ్ల మీద భారీగా నిలిచిపోవడం, రహదారులు దెబ్బతినడంతో విద్యార్థులకు ఇబ్బంది ఎదురౌతుందని అధికారులు గుర్తించారు.
శుక్రవారం, శనివారం విద్యాసంస్థలు అన్ని మూసివేయాలని దక్షిణ కన్నడ జిల్లాధికారి శశికాంత్ సెంథిల్ ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం, శనివారం దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
కర్ణాటక కరావళి (కోస్తా ప్రాంతం)తో పాటు మంగళూరు, ఉడిపిలో భారీ వర్షాలు పడటంతో జనజీవనం అస్తవ్యస్థం అయ్యింది. పర్యాటకులు, ఉడిపికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు మనవి చేశారు. దక్షిణ కన్నడ జిల్లా, మంగళూరు, ఉడిపికి వచ్చిన పర్యాటకులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.