నీడ పడిందని దళిత యువతిని చావబాదారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గణేష్పూర్ అనే గ్రామంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన నీడ అగ్ర కులస్తుడిపై పడిందని ఓ దళిత బాలికను అగ్రకులస్తులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూన్ 13న చోటు చేసుకుంది. అదే రోజున బాధితులు గడిమల్హేరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు ప్రకారం.. అతని కూతురు మంచినీళ్ల కోసం చేతి పంపు వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటోంది.
అదే సమయంలో అక్కడే వున్న అగ్ర కులస్తుడైన పురణ్ యాదవ్ అనే వ్యక్తిపై ఆమె నీడ పడింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు, అతని కుటుంబంలోని మహిళలు బాధితురాలిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.
అంతేగాక, మరోసారి చేతి పంపు వద్దకు వస్తే చంపేస్తామని ఆ బాలికను బెదిరింపులకు గురిచేశారు. కాగా, తీవ్రంగా గాయపిన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆమె కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ కేసును ఏఎస్పీ నీరజ్ పాండే పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి దిశగా పయనిస్తున్నప్పటికీ కులం పేరుతో దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం.