ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల- ఏడు దశల్లో- మార్చి 10న ఫలితాలు-ముఖ్య తేదీలివే
ఈ ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ సీట్లకు ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో గోవాలోని 40, పంజాబ్ లో 117, యూపీలో 403, మణిపూర్ లో 28, ఉత్తరాఖండ్ లోని 70 సీట్లు ఉన్నాయి. వీటికి వివిధ దశల్లో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
కోవిడ్ పరిస్ధితుల దృష్ట్యా ప్రతీ పోలింగ్ బూత్ లోనూ ఓటర్ల సంఖ్యను 1250కి తగ్గిస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ సంఖ్య 1500గా ఉండేది. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 18..34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 24.5 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. అభ్యర్ధులకు ఆన్ లైన్ లో నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. అభ్యర్ధులపై నమోదైన క్రిమినల్ కేసుల్ని తప్పనిసరిగా టీవీ ఛానళ్లు, పత్రికల్లో బహిర్గతం చేయాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర సూచించారు.
ఎన్నికల్లో పాల్గొంటున్న అధికారులు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర డోస్ వేయాలని ఈసీ నిర్ణయించింది. ఇప్పటికే కోవిడ్ రెండు డోసులు తీసుకోని వారికి ఆ మేరకు ముందుగా రెండు డోసులు పూర్తి చేస్తారు. అనంతరం బూస్టర్ డోస్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని కోవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. కోవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సుశీల్ చంద్ర వెల్లడించారు. కోవిడ్ ధర్డ్ వేవ్ అంచనా వేసేందుకు జనవరి 15 వరకూ పాదయాత్రలు, ర్యాలీలు, రోడ్ షోలు కూడా నిషేధించింది. అభ్యర్ధుల గెలుపు తర్వాత సంబరాల్ని కూడా నిషేధించింది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ( 403 సీట్లు)-
తొలి విడత పోలింగ్ తేదీ - ఫిబ్రవరి 10
రెండో విడత పోలింగ్ తేదీ - 14 ఫిబ్రవరి
మూడో విడత పోలింగ్ తేదీ - 20 ఫిబ్రవరి
నాలుగో విడత పోలింగ్ తేదీ - 23 ఫిబ్రవరి
ఐదో విడత పోలింగ్ తేదీ -ఫిబ్రవరి 27
ఆరో విడత పోలింగ్ తేదీ - మార్చి 3
ఏడో విడత పోలింగ్ తేదీ - 7 మార్చి
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 (70 సీట్లు) - ముఖ్యమైన తేదీలివే
పోలింగ్ తేదీ -ఫిబ్రవరి 14
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 ( 117 సీట్లు )- ముఖ్యమైన తేదీలివే
పోలింగ్ తేదీ - ఫిబ్రవరి 14
గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 (40 సీట్లు)- ముఖ్యమైన తేదీలివే
పోలింగ్ తేదీ -ఫిబ్రవరి 14
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు 2022 (28 సీట్లు)- ముఖ్యమైన తేదీలివే
తొలి విడత పోలింగ్ తేదీ - 27 ఫిబ్రవరి
రెండో విడత పోలింగ్ తేదీ -మార్చి 3
Recommended Video
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ ఏడాది ఈసీ భారీ కసరత్తే చేసింది. ఇప్పటికే జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ తో పాటు కేంద్ర ఆరోగ్యశాఖతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. అలాగే ఐదు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు కూడా తీసుకుంది. అన్ని పార్టీలూ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్న కోరాయి. దీంతో ఎన్నికల నిర్వహణపై ఈసీ ముందడుగు వేసింది.












Click it and Unblock the Notifications