కోపర్ది రేప్ కేసు: నిందితులకు మరణ శిక్ష.. మహారాష్ట్ర సెషన్స్ కోర్టు తీర్పు
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపర్ది రేప్ సంఘటనలో నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది.
ముంబై: నిర్భయ ఉదంతం తరహాలో మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన కోపర్ది రేప్ కేసులో నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. గతేడాది జులైలో జరిగిన ఈ సంఘటనలో దాదాపు 16నెలల తర్వాత నిందితులకు శిక్ష పడటం గమనార్హం.
బుధవారం నాడు మహారాష్ట్ర సెషన్స్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. నిందితులు జితేంద్ర షిండే(25), సంతోష్ భవాల్(36), నితిన్ భైల్యూమ్(26)లను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. అడిషనల్ స్పెషనల్ జడ్జి సువర్ణ కేవల్ ఈ తీర్పు వెలువరించారు.
ఉదయం 11.25గం.కు కేసుపై విచారణ మొదలైంది. తీర్పు నేపథ్యంలో కోర్టు ఎదుట వందలాది మంది ప్రజలు గుమిగూడారు. నిందితులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడగానే.. బయట ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.

కోర్టు తీర్పు తర్వాత బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. 'న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది. ఈ తీర్పు కోసమే ఏడాదిన్నర నుంచి ప్రతీరోజు ఎదురుచూస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.
తీర్పుపై స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ మాట్లాడుతూ.. అత్యాచార, హత్య కేసుల్లో నిందితులు ముగ్గురికి కోర్టు మరణ శిక్ష విధించిందని స్పష్టం చేశారు. కాగా, శిక్ష పడ్డ ముగ్గురు నిందితులు ముంబై హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జులై 13, 2016లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తన తాత ఇంటికి వెళ్లి వస్తున్న ఓ తొమ్మిదో తరగతి యువతిపై జితేంద్ర షిండే, సంతోష్ భావల్, నితిన్ లు అత్యాచారం జరిపారు.
ఆపై కాళ్లు, చేతులు విరిచి దారుణంగా హతమార్చారు. అత్యాచారం సమయంలో నిందితులు సారా సేవించి ఉన్నట్లు అప్పట్లో గుర్తించారు.షిండే బైక్ కొన్న సందర్భంగా ముగ్గురు కలిసి పార్టీ చేసుకుని.. అటుగా వెళ్తున్న యువతిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.












Click it and Unblock the Notifications