పన్నీర్ బ్యానర్లలో 'దీప' ఫోటోలు.. రాత్రికే రాత్రే వెలిశాయి..
బ్యానర్లలో జయలలిత, పన్నీర్ సెల్వం, ఎంజీఆర్ లతో పాటు జయ మేనకోడలు దీప ఫొటోను కూడా ఉంచడం గమనార్హం.
చెన్నై: సుప్రీం తీర్పుతో చిన్నమ్మ శశికళ జైలుకు వెళ్లడం ఖాయం కాగా.. సీఎం కుర్చీ కోసం పళనిస్వామితో పన్నీర్ సెల్వం పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. శశికళకు చెక్ పెట్టగలిగితే సీఎం కుర్చీలో కూర్చోవడం ఖాయమనుకున్న పన్నీర్ కు పళనిస్వామి రూపంలో మరో ప్రతికూలత ఏర్పడిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోను ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం చేతుల్లోకి వెళ్లవద్దని భావించిన శశికళ.. పళనిస్వామిని పార్టీ శాసనాసభపక్ష నేతగా నియమించారు. మరోవైపు పన్నీర్ సెల్వం వ్యూహాలు సైతం కొత్త చర్చకు తావిస్తున్నాయి. మంగళవారం రాత్రికి రాత్రే పన్నీర్ సెల్వం ఇంటి ఎదుట పలు కొత్త బ్యానర్లు వెలిశాయి.
బ్యానర్లపై జయలలిత, పన్నీర్ సెల్వం, ఎంజీఆర్ లతో పాటు జయ మేనకోడలు దీప ఫొటోను కూడా ఉంచడం గమనార్హం. దీప జయకుమార్ కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న యోచనలో భాగంగానే ఈ కొత్త బ్యానర్లు పుట్టుకొచ్చాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. శశికళను ఒంటరి చేసే ఉద్దేశంతో పన్నీర్ సెల్వంకు దీపజయకుమార్ మద్దతు పలుకుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
శశికళకు వ్యతిరేకంగా ఉన్నవారందరిని పన్నీర్ సెల్వం తన శిబిరంలో చేర్చుకుని ముందుకు సాగుతున్నారు. అయితే మెజారిటీ ఎమ్మెల్యేలంతా పళనిస్వామి వైపే ఉండటంతో పన్నీర్ పాచికలు ఎంతవరకు పారుతాయన్నది వేచిచూడాలి.