రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష: ఎంపీగా అనర్హుడవుతారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో కాంగ్రెైస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి గుజరాత్లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనపై లోక్సభ ఎంపీగా అనర్హత వేటు పడుతుందా? అనే అంశం చర్చనీయాంశమైంది.
నేర నిరూపణ అయితే ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉదహరిస్తున్నారు. ప్రజాపాతినిథ్య చట్టం 1951 ప్రకారం పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. దీన్ని బట్టి సూరత్ కోర్టు తీర్పును పరిణలోకి తీసుకుని లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తాజా తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు 30 రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో అప్పటి వరకు ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని అంటున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు మాత్రం రాహుల్ హాజరు కాకపోవచ్చని భావిస్తున్నారు. మరోవైపు, భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ లండన్లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, అంతవరకు సభలో ప్రసంగించే ప్రసక్తే లేదని బీజేపీ పట్టుబడుతోంది.
కాగా, మోడీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు అంటూ రాహుల్ గాంధీ గతంలో వ్యాఖ్యానించారు. పలు కుంభకోణాలు చేసి పరారీలో ఉన్న నిందితులు నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో పోలీస్తూ ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications