సైన్యం రాజీపడలేదు, రేపటి వరకు కూంబింగ్: పారికర్
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో వైమానిక స్థావరంపై దాడికి యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. మంగళవారం పఠాన్కోట్ వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిపై ప్రకటన చేశారు.
భద్రత విషయంలో సైనికులు రాజీ పడలేదన్నారు. పఠాన్కోట్లో కూంబింగ్ బుధవారం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్యం చేయకుండాఅక్కడే పేల్చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
గ్రెనేడ్లు నిర్వీర్యం చేస్తూ ఇప్పటికే ఒక అధికారిని కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఉగ్రవాదులను సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అభినందించారు. ఉగ్రదాడిపై ఎన్ఐఏ ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు పారికర్ తెలిపారు. ఉగ్రవాదుల వద్ద పాకిస్థాన్లో తయారైన ఆయుధాలు లభ్యమయ్యాయని చెప్పారు. పఠాన్కోట్లో సైనిక కార్యాచరణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.