లేహ్ లో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, సీడీఎస్- ఆర్మీఛీఫ్ - సడెన్ విజిట్ వెనుక కారణమేంటి ?
భారత్-చైనా మధ్య గల్వాన్ ఘటన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తాజా పరిస్ధితిని సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీఛీఫ్, సీడీఎస్ లతో కలిసి లేహ్ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడి వ్యూహత్మక ప్రాంతాల నుంచి ఇరుదేశాల బలగాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో తాజా పరిస్ధితిని తెలుసుకునేందుకు రక్షణమంత్రి, సైనిక పెద్దలతో కలిసి వెళ్లారని చెబుతున్నా.. అంతకు మించిన కారణాలు కూడా ఉండొచ్చని తెలుస్తోంది.
Recommended Video
ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ చైనా: రెండూ కావాల్సిన దేశాలే: ట్రంప్ స్నేహగీతం: ఏమైనా..ఎందాకైనా
లేహ్ లో రక్షణమంత్రి, ఆర్మీ పెద్దలు..
గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య మిలిటరీ స్ధాయిలో పలు దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా బలగాల ఉపసంహరణ జరిగింది. చర్చల్లో అంగీకరించిన మేరకు ఇరుదేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో పరిస్ధితి సాధారణ స్ధితికి రాలేదని తెలుస్తోంది. దీంతో మిలటరీ వర్గాలతో సమావేశమై వాస్తవ పరిస్ధితిని సమీక్షించేందుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ లేహ్ కు వెళ్లారు. ఈ టూర్ లో రాజ్ నాథ్ తో పాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీఛీఫ్ నరవణే కూడా ఆయన వెంట ఉన్నారు.
రెండు రోజుల పర్యటన- లేహ్, కశ్మీర్ లో...
వాస్తవాధీన రేఖ ఎల్ఏసీతో పాటు ఎల్ఓసీ వద్ద కూడా వాస్తవ పరిస్ధితులను రాజ్ నాథ్ స్వయంగా పరిశీలించనున్నారు. అంతకంటే ముందే ఆయన సైనిక వర్గాలతో సమావేశమై బలగాల ఉపసంహరణ, అనంతర పరిస్ధితులపై చర్చించనున్నారు. ఆర్మీ ఏర్పాటు చేసిన పారా డ్రాపింగ్ ను కూడా ఆయన వీక్షించనున్నారు. ఇప్పటికే లేహ్ కు చేరుకున్న రక్షణమంత్రి సరిహద్దుల్లో సైనికులు వాడుతున్న పలు అత్యాధునిక ఆయుధాలను కూడా పరీక్షించారు. తన రెండు రోజుల పర్యటనలో రాజ్ నాథ్ బృందం స్టాక్నా, లుకుంగ్ ఫార్వాడ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఆర్మీ సన్నద్ధత, ఇతర అంశాలపైనా సైన్యాధిపతులు ఆయనకు స్వయంగా వివరాలు అందజేయనున్నారు..
ప్రధాని సడెన్ విజిట్ తర్వాత...
చైనాతో ఘర్షణలు మొదలై పరిస్ధితులు ఇంకా ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో జూలై 3న ప్రధాని మోడీ లేహ్ తో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. వాస్తవానికి ఆ పర్యటనకు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఆ పర్యటనకు వెళ్లలేకపోయారు. కానీ తాజా పరిస్ధితుల నేపథ్యంలో సరిహద్దుల్లో కాపలా కాస్తున్న బలగాల్లో స్ధైర్యం నింపేందుకు రక్షణమంత్రి రాజ్ నాథ్ ను అక్కడికి వెళ్లాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన దాదాపు ప్రధాని గతంలో పర్యటించిన ప్రాంతాలతో పాటు పాకిస్తాన్ సరిహద్దుల్లోనూ పర్యటించి వాస్తవ పరిస్ధితి అంచనా వేయనున్నారు.
రాజ్ నాథ్ సడెన్ విజిట్ వెనుక..
ప్రధాని మోడీ పర్యటన తరహాలోనే రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ బృందం సరిహద్దులకు వెళుతున్నట్లు కూడా ముందుగా సైనిక వర్గాలకు మాత్రమే సమాచారం ఇచ్చారు. మీడియాతో పాటు ఇతరులకు దీన్ని గోప్యంగా ఉంచారు. అయితే బలగాల ఉపసంహరణ మొదలయ్యాక అక్కడ పూర్తిస్ధాయిలో ఈ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అన్నది ప్రభుత్వం తరఫున అంచనా వేయడం ద్వారా పొరుగుదేశానికి సంకేతాలు పంపాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ప్రధానితో పాటు రక్షణమంత్రి, ఆర్మీఛీఫ్, సీడీఎస్ సైనికులకు స్ధైర్యం నింపే పేరుతో సరిహద్దుల్లో తరచూ పర్యటిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వం, సైన్యం మధ్య సమన్వయం మరింత పెరగడంతో పాటు సాధారణ ప్రజలు, పొరుగుదేశానికి కూడా సంకేతాలు పంపాలనేది మోడీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.