ఎన్పీఆర్, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం: కేజ్రీవాల్ వేడుకోలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రానికి షాకిచ్చారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్), జాతీయ పౌర పట్టిక(ఎన్ఆర్సీ)కి వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ శుక్రవారం తీర్మానం చేసింది. ఎన్పీఆర్, ఎన్ఆర్సీపై చర్చించేందుకు ఒక రోజు ప్రత్యేకంగా సమావేశమైన ఢిల్లీ అసెంబ్లీ ఈ మేరకు తీర్మానానికి ఆమోదం తెలిపింది.
పర్యవరణ మంత్రి గోపాల్ రాయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఆమోదం తెలిపింది. చేతులెత్తి వేడుకుంటున్నా వీటిని వెనక్కి తీసుకోవాలని సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తనతోపాటు తన మంత్రివర్గంలోని చాలా మందికి బర్త్ సర్టిఫికేట్లు లేవని అన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు.

70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం ఏడుగురికి మాత్రమే బర్త్ సర్టిఫికేట్లు
ఉన్నాయని తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు.
అంతకుముందు తీర్మానంపై చర్చ సందర్భంగా పలువురు ఆప్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎన్ఆర్సీకి ఎన్పీఆర్కి అనేది బ్యాక్ డోర్ అని, దేశంలో ఎక్కడా ఎన్పీఆర్ చేపట్టకూడదని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎన్పీఆర్ చేపట్టాలనుకుంటే 2010 విధానాన్నే అనుసరించాలన్నారు. కాగా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా కేరళ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications