మిలిటరీ దుస్తుల్లో ఢిల్లీ బీజేపీ చీఫ్ బైక్ ర్యాలీ, విమర్శలు: స్పందించిన తివారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ పార్టీకి సంబంధించిన మోటార్ బైక్ ర్యాలీలో ఆర్మీ దుస్తులు వేసుకొని వచ్చారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోకసభ పరిధిలోని యమునా విహార్ ప్రాంతంలో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మనోజ్ తివారీ పాల్గొన్నారు. ఆర్మీ దుస్తులు ధరించి రావడంపై టీఎంసీ నేత డెరెక్ ఓ బ్రెయిన్ సహా విపక్షాలు విమర్శలు గుప్పించాయి.
సిగ్గు.. సిగ్గు.. ఓట్లు అడిగేందుకు ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తీవారి సాయుధ దళాల యూనిఫామ్ను వేసుకసున్నారని, బీజేపీ, మోడీ, అమిత్ షా మన జవాన్లను రాజకీయంగా వాడుకొని అవమానిస్తున్నారని, అంతేకాకుండా దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతున్నారని డెరెక్ ఓ బ్రెయిన్ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నేత షర్మిష్ట ముఖర్జీ తన ట్వీట్లో... ఓ సైనికుడు తన జీవితాన్ని త్యాగం చేస్తారని, అలాంటిది బీజేపీ ఎంపీ ఆ దుస్తుల్లో పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం అవమాకరమని పేర్కొన్నారు.
గౌరవ్ పృధ్వీ అనే ఓ నెటిజన్ కూడా సైనికుల దుస్తులు ధరించి పార్టీ కార్యక్రమంలో పాల్గొనడం సరికాదని, ఢిల్లీలో ఆర్మీ దుస్తులు ధరించి ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం సరికాదన్నారు.
ఈ విమర్శల నేపథ్యంలో మనోజ్ తివారీ స్పందించారు. మన దేశ ఆర్మీ అంటే ఎంతో గర్వంగా ఉందని, అందుకే ఆర్మీ దుస్తులు ధరించానని, తాను ఇండియన్ ఆర్మీలో లేకపోయినా ఇలా తన సంఘీభావం తెలియజేశానని, ఇలా చేయడం అవమానించడమెలా అవుతుందని, నెహ్రూ జాకెట్ వేసుకుంటే.. జవహర్లాల్ నెహ్రూను అవమానించినట్టేనా అని తివారీ ప్రశ్నించారు.