నిర్భయ కేసు : ఉరిశిక్షపై స్టే పిటిషన్ను కొట్టివేసిన ఢిల్లీ కోర్టు..
మార్చి 3,ఉదయం 6గంటలకు నిర్భయ దోషులకు ఢిల్లీ పటియాలా కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఉరిశిక్షపై స్టే ఇవ్వాలంటూ నిర్భయ దోషులైన అక్షయ్ కుమార్ సింగ్,పవన్ గుప్తా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా కోర్టు ఈ పిటిషన్లను కొట్టిపారేసింది. అంతకుముందు సుప్రీంకోర్టు పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను కొట్టిపారేసింది.
మరోవైపు అక్షయ్ కుమార్ శుక్రవారం మరోసారి క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నారు.గతంలో ఫిబ్రవరి 5న మొదటిసారి అతను దరఖాస్తు చేసుకున్న క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించారు. తాజాగా మరోసారి అతను క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
అటు ఇప్పటివరకు ఎలాంటి న్యాయ అవకాశాన్ని ఉపయోగించుకోని పవన్ గుప్తా.. ఇంకా క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. క్షమాభిక్ష తిరస్కరణకు గురైతే మళ్లీ సుప్రీంను ఆశ్రయించవచ్చు. కాబట్టి మార్చి 3,ఉదయం 6గంటలకు వారిని ఉరితీయడం సాధ్యపడుతుందా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.