ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించి, అభివృద్ధికే పట్టం కట్టారు: కేజ్రీవాల్కు మమత బెనర్జీ అభినందనలు
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయంపై టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీపై ఒంటికాలిపై లేచారు. బీజేపీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని ఫైరయ్యారు.
యాంటి బీజేపీ..?
దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీయడం ప్రారంభమయ్యాయని దీదీ అన్నారు. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించడంతో నాంది పడిందని చెప్పారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కల్లబొల్లి కబుర్లు చెప్పినా ప్రజలు విశ్వసించలేదన్నారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని చెప్పారు. కానీ మోడీ, షా ద్వయం మాత్రం మాటలతో మారేడుకాయ చేస్తారని ఫైరయ్యారు.
మోసం..
పౌరసత్వ సవరణ చట్టంతో ప్రజల వ్యతిరేకత స్పష్టమైందని మమతా బెనర్జీ గుర్తుచేశారు. ఇప్పటికైనా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ కూడా అలాంటిదేనని దుయ్యబట్టారు. జాతీయ పౌర రిజిష్టర్ పేరుతో కూడా చేస్తోన్న మోసాన్ని ప్రజలు గమనించారని గుర్తుచేశారు. ప్రజలు మాటలను, చేతలను గమనిస్తున్నారని పేర్కొన్నారు.
మూడోసారి..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ వరసగా మూడోసారి విజయం సాధిస్తోంది. 58 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 12 సీట్లలో మాత్రమే ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం ఆ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేస్తోంది. మొత్తానికి హస్తిన ప్రజలు ఆప్కు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు.