ఢిల్లీ హంగ్: అధికారం ఎవరిది, రాష్ట్రపతి పాలనా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎవరు అధికారాన్ని చేపడుతారు, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై ఆసక్తి నెలకొంది. బిజెపి 32 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీని సాధించలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ హీరోగా అవతరించి 28 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెసు పార్టీ కేవలం 8 సీట్లకు పరిమితమైంది.
ఢిల్లీ శాసనసభలో మొత్తం 75 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కనీసం 36 సీట్లు కావాలి. అయితే, అతి పెద్ద పార్టీగా అవతరించిన బిజెపిని లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. తనకు సంఖ్యాబలం లేదని, అందువల్ల ప్రభుత్వంలో భాగం పంచుకోబోనని బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ అంటున్నారు. ఓటర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేనని, తాను నిస్సహాయుడినని ఆయన అన్నారు.

బిజెపి అధికారాన్ని చేపట్టడానికి సిద్ధంగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. తాము ఏ పార్టీకీ మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పటికే చెప్పారు. ఈ స్థితిలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. ఆ తర్వాత లోకసభ ఎన్నికలతో పాటు ఢిల్లీ శాసనసభ ఎన్నికలు మళ్లీ జరిగే అవకాశాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వ ఏర్పాటుపై ఆలోచించాలని బిజెపిలోని ఓ వర్గం అంటోంది. కానీ ఫిరాయింపులను ప్రోత్సహించకూడదని కూడా అదే సమయంలో అనుకుంటోంది. తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన స్వతంత్ర సభ్యుడు రంబీర్ షోకీన్ బిజెపికి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దాంతో బిజెపి బలం 33కు పెరుగుతుంది. ఇక ఏ వైపు నుంచి కూడా మద్దతు లభించే అవకాశాలు లేవు.
తాము ఎవరికీ మద్దతు ఇవ్వబోమని, ఇతర పార్టీల మద్దతు తీసుకోబోమని అర్వింద్ కేజ్రీవాల్ చెప్పారు. తాము విమర్శలు ఎక్కుపెట్టిన పార్టీల మద్దతు తాము తీసుకోబోమని అన్నారు. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేనట్లే.












Click it and Unblock the Notifications