బీజేపీకి కేజ్రీవాల్ 9 పాఠాలు: షాకు చెక్, మోడీని ఓడించేందుకు...
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు దారుణంగా దెబ్బతిన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయం సాధించింది.
70 అసెంబ్లీ స్థానాలకు గాను ఏఏపీ 67 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితం అయింది.
కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలుచుకోలేదు. కేజ్రీవాల్ ఒంటిచేతితో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఊడ్చేశారు. ఇవి ఆ రెండు పార్టీలకు హెచ్చరికలే.
నరేంద్ర మోడీ
సార్వత్రిక ఎన్నికల నుండి నిన్నటి వరకు బీజేపీ మోడీ హవా అంటూ ప్రచారం చేసింది. ఢిల్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మోడీ పాలనకు రిఫరెండం కాదని చెప్పాయి. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ బీజేపీని ఊడ్చిపెట్టారు. దీంతో గతంలో 32 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మూడు స్థానాలకు దారుణంగా దిగజారింది. ఈ నేపథ్యంలో మోడీ హవా క్రమంగా కనుమరుగు అవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. పూర్తిగా మోడీ పైన ఆధారపడవద్దని బీజేపీ వర్గాలు ఇప్పటికైనా తెలుసుకోవాలని అంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ తన తదుపరి లక్ష్యాన్ని పంజాబ్గా పెట్టుకొంది. ఢిల్లీలో మోడీ హవాను దెబ్బతీసిన కేజ్రీవాల్.. ఇప్పుడు పంజాబ్ పైన మరింత దృష్టి సారించనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు తేడా ఉంటుంది బీజేపీ గుర్తించాలని చెబుతున్నారు.
రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ పతనం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ఎఫెక్ట్తో, ఇప్పుడు కేజ్రీవాల్ దెబ్బకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడింది. రాహుల్ గాంధీ నాయకత్వం పైన కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది.
కిరణ్ బేడీ
కిరణ్ బేడీని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ఆ పార్టీ వర్గాలను తీవ్ర నిరాశలో ముంచాయి. ఏళ్లుగా కష్టపడ్డ వారిని పక్కన పెట్టి నిన్నటికి నిన్న వచ్చిన బేడీని అందలమెక్కించడం పార్టీ వర్గాలకు రుచించలేదని, ఈ నేపథ్యంలో పార్టీలో ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
వ్యతిరేకత
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత వల్ల బీజేపీ గెలిచింది. అలాగే దానికి మోడీ వేవ్ కలిసి వచ్చింది. దీంతో స్పష్టమైన మెజార్టీ సాధించింది. అయితే, మోడీ పాలన ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోలేదని అర్థమవుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే, మోడీని ఎదుర్కొనేందుకు విపక్షాలు అన్ని ఏఏపీ వైపు మొగ్గు చూపాయని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
ముస్లీంలు
మైనార్టీ వర్గాలు ఇప్పటికీ బీజేపీ వైపు లేరని ఈ ఎన్నికలు చెబుతున్నాయని అంటున్నారు. బీజేపీ ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి నష్టం కలిగించాయని అంటున్నారు.
అమిత్ షా
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో అమిత్ షా వ్యూహం ఫలించింది. కానీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అది విఫలమైంది. ఇది అమిత్ షాక్ మేజర్ సెట్ బ్యాక్ అని చెప్పవచ్చు.
రాష్ట్రాలు, లోకసభ ఎన్నికలకు వేర్వేరు
లోకసభ ఎన్నికలను, ఆయా రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా చూడాలని ఈ ఫలితాల ద్వారా తెలుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. మోడీ పైన పూర్తిగా ఆధారపడటం బీజేపీకి నష్టం చేకూర్చిందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల నుండి మొన్నటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల పైన ఆధారపడి బీజేపీ విజయం సాధించింది. ఢిల్లీలో మోడీ కంటే కిరణ్ బేడీ పేరు ఎక్కువగా వినిపించింది. ఈ నేపథ్యంలో మోడీని ఒక్కసారిగా పక్కన పెట్టడం కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోడీకి వ్యతిరేక పార్టీల ఏకం
బీజేపీ ఓటమికి అన్నింటికంటే బీజేపీ అనడంకంటే.. మోడీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై కమలం పార్టీని ఓడించాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క మోడీని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా విపక్షాలు ఒక్కటవుతున్న విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు ఢిల్లీలో ఏఏపీకి అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. అందుకు మమతా బెనర్జీ, వామపక్షాలు మద్దతివ్వడమే నిదర్శనం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తాము ఓడుతున్నామని భావించినచోట కేజ్రీవాల్ పార్టీ గెలుపుకు సహకరించిందని చెబుతున్నారు.