హోటళ్లలో సర్వీస్ ఛార్జ్ 10 శాతం దాటొద్దు-ఆ పేరు వాడొద్దు- ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశం..
దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లకు వెళ్లే వినియోగదారులకు హైకోర్టు భారీ ఊరటనిచ్చింది. హోటళ్లలో తినే ఆహారపదార్ధాలపై విధించే సర్వీస్ ట్యాక్స్ విషయంలో ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హోటళ్లలో ఆటోమేటిగ్గా విధిస్తున్న సర్వీస్ ఛార్జీల్ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఢిల్లీలోని హోటళ్లలో వసూలు చేసే సర్వీస్ ఛార్జీ బిల్లులో 10 శాతం దాటకూడదని ఆదేశించింది.
అలాగే హోటళ్లు తమ కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జ్గా వసూలు చేస్తున్న మొత్తానికి ఆ పేరు కాకుండా స్టాఫ్ కంట్రిబ్యూషన్ అనే పదాన్ని ఉపయోగించాలని రెస్టారెంట్ అసోసియేషన్ సభ్యులకు ఢిల్లీ హైకోర్టు సూచించింది. హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులపై ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జీ వసూలు చేయడాన్ని నిషేధించే మార్గదర్శకాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ప్రతిభా ఎం సింగ్.. హోటల్స్ తమ మెనూ కార్డ్లలో ఈ మొత్తం విధింపును స్పష్టంగా పేర్కొనాలని ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (FHRAI)ని ఆదేశించారు.

దీనిపై స్పందించిన ఫెడరేషన్.. 3,300 పైగా హోటళ్లు తమ సభ్యులుగా ఉన్నాయని తెలిపింది. అలాగే తమ సభ్యుల మధ్య సర్వీస్ ఛార్జీ విధించే విషయంలో ఏకరూపత లేనప్పటికీ, మొత్తానికి ప్రత్యామ్నాయ పదాన్ని ఉపయోగించడంపై మాత్రం ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. అయితే దాదాపు 1,100 మంది సభ్యులను కలిగి ఉన్న పిటిషనర్ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వీస్ ఛార్జ్ అనేది ఆమోదించబడిన పదమని, దానిని భర్తీ చేయలేమని, దాని వినియోగానికి సంబంధించి ఎటువంటి గందరగోళం లేదని పేర్కొంది.
దీంతో ఈ విషయంపై విచారణ అవసరమని, ఈలోగా హోటల్స్ ఫెడరేషన్ సభ్యులు వారు వసూలు చేస్తున్న సేవా రుసుము మొత్తానికి 'స్టాఫ్ కంట్రిబ్యూషన్' అనే పదాన్ని ఉపయోగించాలని హైకోర్టు సూచించింది. అలాగే హోటళ్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీ జీఎస్టీ కాకుండా 10 శాతం దాటకుండా చూడాలని ఆదేశించింది. అలాగే ఈ ఆదేశాలు మొత్తం దేశాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ అంశాన్ని అక్టోబర్ 3న విచారణకు లిస్ట్ చేయాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications