నీట్ అర్హతలపై అభ్యంతరాలు: స్టే విధించిన ఢిల్లీ హైకోర్టు.. మాకు సంబంధం లేదన్న సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాల కోసం సీబీఎస్ఈ జారీ చేసిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నోటిఫికేషన్లోని అర్హత నిబంధనలపై ఢిల్లీ హైకోర్టు బుధవారం స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. నోటిఫికేషన్లోని నిబంధనలతో పరీక్ష రాసేందుకు అర్హత కోల్పోయిన అనేక మంది విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తమ స్పందన తెలపాల్సిందిగా కోర్టు సీబీఎస్ఈతోపాటు భారత వైద్య మండలి (ఎంసీఐ)ని కూడా ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత లేకపోయినా అభ్యర్థులు నీట్కు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
అయితే దాని అర్థం వారిని కచ్చితంగా పరీక్షకు అనుమతిస్తారని కాదనీ, అది తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. నీట్ దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల తొమ్మిదో తేదీ చివరితేదీ కాగా పరీక్ష మే ఆరో తేదీన జరగనున్నది. కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అనుమతి నిరాకరణ
నీట్ రాయడానికి సాధారణ విద్యార్థులకు 25 ఏళ్లు, రిజర్వుడ్ విద్యార్థులకు 30 ఏళ్ల వరకు గడువు విధించాయి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అలాగే ఓపెన్ స్కూలులో ఇంటర్ చదివిన వారు రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నా, అదనంగా బయాలజీ సబ్జెక్ట్ తీసుకున్నానీట్ రాసేందుకు అనర్హులు. ప్రైవేట్ గా ఇంటర్ పాసైన వారు కూడా అనర్హులేనని ఎంసీఐ, సీబీఎస్ఈ స్పష్టం చేశాయి.

సందేహాలు ఉంటే ఎంసీఐని సంప్రదించాలని సీబీఎస్ఈ
వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్కు విద్యార్హతలు నిర్ణయించడంలో తమ పాత్ర లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)ని సంప్రదించాలని సూచించింది. దూర విద్యలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు, 12 వ తరగతిలో జీవశాస్త్రాన్ని అదనపు సబ్జెక్టుగా అభ్యసించిన వారిని నీట్కు అనర్హులుగా ప్రకటించడంతో ఫిzదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

ఎంసీఐ సమర్పించిన విద్యార్హతల మేరకే పరీక్ష నిర్వహణ
ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ స్పందిస్తూ‘ ఎంసీఐ సమర్పించిన విద్యార్హతల మేరకు నీట్ పరీక్ష నిర్వహణ వరకే మా బాధ్యత. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించాం. ఇకపై ఎలాంటి ఫిర్యాదులనైనా మాకు పంపే ముందు నీట్ వెబ్సైట్లో ఉంచిన సమాచారాన్ని జాగ్రత్తగా చదువుకోగలరు' అని అభ్యర్థులకు సూచించింది. మరోవైపు, మే 6న జరిగే నీట్ పరీక్షకు మరో 43 పట్టణాల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఇందులో తెలంగాణ నుంచి 2 పట్టణాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పట్టణాలున్నాయి. దీంతో ఈసారి మొత్తం 150 పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది.

రాష్ట్ర స్థాయి సీట్ల భర్తీ 70 శాతం మాత్రమే
తెలంగాణలో వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీ అంశం కొలిక్కి వచ్చింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ డిగ్రీ కోర్సుల సీట్ల భర్తీలో నేషనల్ పూల్లో చేరితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కోటా ఉంటుందా? లేదా? అనే సందేహాలకు తెరపడింది. నేషనల్ పూల్లో చేరినా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కోటా కొనసాగనున్నది. పూర్తి పరిశీలన అనంతరం తెలంగాణ న్యాయ శాఖ స్పష్టత ఇచ్చింది. మన రాష్ట్రం నేషనల్ పూల్లో చేరినా ఉమ్మడి రాష్ట్రాల కోటా కొనసాగాలని స్పష్టం చేసింది.

వచ్చే విద్యాసంవత్సరం నుంచి నేషనల్ ఫూల్లోకి తెలంగాణ
వైద్య విద్య సీట్ల భర్తీ అంశంలో నేషనల్ పూల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) ఆమోదం తెలిపాయి. 2018-19 విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్ విధానం అమలు కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అధికారికంగా వెల్లడించాయి. కాళోజీ నారాయణరావు వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ బి.కరుణాకర్రెడ్డి నేషనల్ పూల్ అమలు విషయాన్ని ధ్రువీకరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి నేషనల్ పూల్తోపాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల కోటా సైతం ఉంటుందన్నారు.

జమ్మూకశ్మీర్ మినహా దేశమంతటా నేషనల్ ఫూల్ అమలు
నేషనల్ పూల్ పరిధిలో ప్రస్తుతం 4,157 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న జమ్మూకశ్మీర్ వైద్య సీట్లను సొంతంగానే భర్తీ చేసుకుంటోంది. ఈ రాష్ట్రం మినహా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వంటి వైద్య విద్య డిగ్రీ సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు నేషనల్ పూల్లో చేరలేదు. తాజాగా రెండు రాష్ట్రాలు నేషనల్ పూల్లో చేరాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానం అమలవుతుంది.












Click it and Unblock the Notifications