జిలేబి లేటైందని కాల్చేశాడు: విక్టిమ్ పరిస్థితి సీరియస్
వివరాల్లోకి వెళితే.. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నీరజ్ కుమార్ స్థానిక జిలేబి షాపుకి వెళ్లాడు. అక్కడ జిలేబి ఆర్డర్ ఇచ్చాడు. షాపులో ఎక్కువ రద్దీ ఉన్న కారణంగా జిలేబి అందించడంలో కొంత ఆలస్యమైంది. దీంతో షాపులో పని చేస్తున్న కార్మికులతో వాగ్వాదానికి దిగాడు నీరజ్ కుమార్. కొంతసేపు ఘర్షణ పడిన నీరజ్ కుమార్ ఆగ్రహానికి గురై తన దగ్గర ఉన్న తుపాకీ తీసుకుని సతేందర్ సింగ్ అనే కార్మికుడిపై కాల్పులు జరిపాడు.
దీంతో సతేందర్ సింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. షాపు యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి చేరుకున్న పోలీసులు, నిందితుడైన నీరజ్ కుమార్ను అరెస్ట్ చేశారు. షాపులో అమర్చిన సిసిటీవి ఫుటేజీని ఆధారంగా పోలీసులు సేకరించారు.
సిఎంఎస్ ఏజెన్సీలో నిందితుడు నీరజ్ కుమార్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని చెబుతుండగా, ఆ కంపెనీ మాత్రం నిరాకరించిందని పోలీసులు తెలిపారు. ఘటన పట్ల తాము తీవ్రంగా ఆవేదనకు గురయ్యామని, బాధితుని కుటుంబానికి తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు ఆ కంపెనీ తెలిపిందని పోలీసులు చెప్పారు. నిందితుడు ఓరియన్ సెక్యూరిటీస్ తరపున విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో ఉండగానే నిందితుడు ఘటనకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.