మునావర్ ఫారూఖీ షో కు ఢిల్లీ పోలీసుల అనుమతి నిరాకరణ.. వీహెచ్పీ లేఖతో నిర్ణయం!!
వివాదాస్పద హాస్యనటుడు మునావర్ ఫరూఖీ షో ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆగస్టు 28న ఢిల్లీలో జరగాల్సిన షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ మేరకు సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు ఒక నివేదికలో తెలిపారు. వీహెచ్పీ ఢిల్లీ అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గుప్తా ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించటంతో అనుమతి నిరాకరించడం జరిగిందని తెలుస్తుంది.
మునావర్ ఫారూఖీ షో పై వీహెచ్పీ, భజరంగ్ దళ్ అభ్యంతరం
విశ్వహిందూ పరిషత్ ఢిల్లీ అధ్యక్షుడు సురేంద్ర కుమార్ గుప్తా పోలీస్ కమీషనర్కు రాసిన లేఖలో, ఇటీవల హైదరాబాద్ ఘర్షణకు మునావర్ ఫారూఖీ షో కారణమని ఆరోపించారు. హాస్యనటుడు మునావర్ ఫారూఖీ తన షోలో హిందూ దేవుళ్ళను అవహేళన చేసాడు అని విమర్శించారు. అలాంటి వ్యక్తి షో నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మునావర్ ఫారూఖీ కార్యక్రమానికి అనుమతి ఇవ్వరాదని తన లేఖలో స్పష్టం చేశారు.
మునావర్ షో కు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు
ఢిల్లీలో ఈ కార్యక్రమం డాక్టర్ ఎస్ పి ఎమ్ సివిక్ సెంటర్, కేదార్నాథ్ సాహ్ని ఆడిటోరియంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9.30 గంటల వరకు జరగాలని నిర్ణయించారు. ఇది ప్రయివేటుగా నిర్వహించే షో అని దీనికి ముందుగా అనుమతి ఇచ్చారు. అయితే విశ్వహిందూ పరిషత్ ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో ప్రదర్శనను రద్దు చేయాలని అభ్యర్థించింది . ప్రదర్శనకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని పేర్కొంది. ఇక బజరంగ్ దళ్ కూడా మునావర్ ఫారూఖీ షో ను అడ్డుకుంటామని హెచ్చరించింది.
హైదరాబాద్ లో మునావర్ షో.. చల్లారని ఉద్రిక్తతలు
ఇక ఈ నేపథ్యంలో మతవిద్వేషాలు చెలరేగుతాయి అన్న కారణంతో ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇదే నెలలో బెంగళూరు పోలీసులు సైతం మునావర్ ఫారూఖీ షో కు అనుమతి నిరాకరించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో మాత్రం ఆయనషో కు అనుమతినిచ్చిన ప్రభుత్వం ఆగస్టు 20వ తేదీన దీనిని పోలీసుల భద్రత మధ్య నిర్వహించింది.
అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించినా మునావర్ షో నిర్వహించారు. మునావర్ షో తర్వాత హైదరాబాద్లో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఆపై రాజా సింగ్ వ్యాఖ్యలతో చోటు చేసుకున్న ఉద్రిక్తత ఇంకా చల్లారలేదు. తాజాగా ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆయన షో కు అనుమతి నిరాకరించారు.