నిరుద్యోగులకు నెలకు రూ.7,500.. సీఏఏపై న్యాయపోరాటం.. ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Recommended Video
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఒకదాన్ని మించి మరోటి భారీ హామీలు గుప్పిస్తున్నాయి. పేదలకు రెండు రూపాయలకే కిలో గోధుమపిండి.. కాలేజీ అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీల పంపిణీ.. ఐదేళ్లలో 10 లక్షల మందికి ఉపాధికల్పన లాంటి తాయిలాలు ప్రకటించిన బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ కొత్త అంశాలతో ముందుకొచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి సుభాష్ చోప్రా ఆదివారం విడుదల చేశారు. ఆనంద్ శర్మ, అజయ్ మాకెన్ తదితర కీలక నేతలూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతా పార్టీలకు భిన్నంగా నిరుద్యోగులపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్.. ఢిల్లీలో తాము గెలిస్తే.. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.5,000.. పోస్ట్ గ్రాడ్యుయేట్లకు రూ.7.500 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చింది.
ప్రస్తుత కేజ్రీవాల్ సర్కారు నెలకు 200 యూనిట్లలోపు కరెంటును ఉచితంగా సరఫరా చేస్తుండగా.. తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్లు ఫ్రీకరెంట్ అందిస్తామని కాంగ్రెస్ తెలిపింది. పేదలకు రూ.15కే భోజనం అందించేలా సిటీలో 100 ఇందిరా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని, మొత్తం బడ్జెట్ లో 25 శాతం కాలుష్య నియంత్రణ కోసం ఖర్చుపెడతామని తెలిపింది.
వివాదాస్ప పౌరసత్వ సవరణ చట్టం(సీసీఏ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో వాగ్ధానం చేయడం గమనార్హం. అలాగే, ఢిల్లీలో ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ లను కూడా చేపట్టబోమని తెలిపింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. 11న ఫలితాలు వెల్లడవుతాయి. గతంలో నాలుగు సార్లు ఢిల్లీ అసెంబ్లీని గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆప్ ఎంట్రీ తర్వాత డీలాపడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆప్, బీజేపీల మధ్య రసవత్తర పోటీ నెలకొనడంతో తనదైన స్థానం కోసం కాంగ్రెస్ పాకులాడుతోంది.