మంత్రి రాజీనామా చేయాలంటూ కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ ధర్నా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. గత వారం టర్క మన్ గేట్ రోడ్ ప్రాంతంలో మరణించిన మహ్మాద్ షెహన్వాజ్ అనే వ్యక్తి మృతి వెనుక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మంత్రి హస్తం ఉందంటూ ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే, గత ఆదివారం అర్ధరాత్రి ఓ బైక్, హ్యూందాయ్ ఐ 20 కారు ఢీ కొన్నాయి. దాంతో కారులోని వ్యక్తులు బైక్పై ఉన్న మహ్మాద్ షెహన్వాజ్పై దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఈ కేసులో నిందిడుతుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి నేత, పర్యావరణ శాఖ మంత్రి అసిమ్ అహ్మద్ ఖాన్కు తెలుసునని, ఘటనకు మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీజేపీ నేత సతీష్ ఉపాధ్యాయ డిమాండ్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా గురువారం ఢిల్లీలోని కేజ్రీవాల్ నివాసం ఎదుట బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని చెదరగొట్టేందుకు వాటర్ క్యాన్స్ కూడా ఉపయోగించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ ఘటనకు పూర్తి బాధ్యత ఢిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వానిదేనని అంటుంది.