ఎన్డీఏకు జై కొట్టిన వైసీపీ- ఆ కీలక బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఢిల్లీ సర్వీస్ బిల్లు.. రాజ్యసభలో ఆమోదం పొందింది. రాత్రి 10 గంటలకు ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. దీనికి అనుకూలంగా 131, ప్రతికూలంగా 102 ఓట్లు పోల్ అయ్యాయి.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తటస్థ వైఖరిని అనుసరిస్తూ వస్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీ ఆర్డినెన్స్కు అనుకూలంగా ఓటు వేసింది. వైసీపీకి చెందిన తొమ్మిది మంది బిల్లుకు మద్దతు ఇచ్చారు. రాజ్యసభలో టీడీపీకి చెందిన ఒకే ఒక్క సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కూడా ఎన్డీఏ వైపే మొగ్గు చూపారు.

ఈ బిల్లు ఇదివరకే లోక్సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నెల 3వ తేదీన లోక్సభలో అధికార పార్టీ.. ప్రవేశపెట్టగా అలవోకగా ఆమోదం లభించింది. పెద్దలసభతో పోల్చుకుంటే లోక్సభలో బీజేపీ, దాని మిత్రపక్షాల బలం ఎక్కువ కావడం వల్ల సులువగానే ఢిల్లీ సర్వీస్ బిల్లు పాస్ అయింది.
రాజ్యసభలో మాత్రం బిల్లుపై రాజముద్ర పడటానికి మిత్రపక్షాలతో పాటు వైఎస్ఆర్సీపీ, బిజూ జనతాదళ్ వంటి తటస్థ రాజకీయ పార్టీల అవసరం కూడా బీజేపీకి ఏర్పడింది. ఇవ్వాళ సభలో ఈ బిల్లుపై వాడివేడిగా చర్చలు సాగాయి. వైఎస్ఆర్సీపీ సహా అన్ని పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అనంతరం వాటన్నింటికీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఢిల్లీ ఆర్డినెన్స్ను ఎందుకు తీసుకుని రావాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలతో చెలరేగారు. కాంగ్రెస్ను ఎదిరించి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్ మద్దతును కూడగట్టిందని ఎద్దేవా చేశారు.
గతంలో కాంగ్రెస్పై ఎన్నో విమర్శలు, ఆరోపణలను ఆప్ ప్రయోగించిందని, ఇప్పుడు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తోనే జట్టు కట్టిందని ధ్వజమెత్తారు అమిత్ షా. ఈ బిల్లును వ్యతిరేకించడానికి కాంగ్రెస్ మద్దతు కోరారంటూ చురకలు అంటించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ కాంగ్రెస్పై విమర్శలు చేస్తారని ఎద్దేవా చేశారు.
అనంతరం.. బిల్లు ఆమోదం కోసం ఓటింగ్ నిర్వహించారు. మూజువాణి పద్ధతిలో ఓటింగ్ సాగింది. దీనికి అనుకూలంగా 131, ప్రతికూలంగా 102 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో బిల్లు సభామోదం పొందినట్లు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రకటించారు. ఓటింగ్ ప్రారంభ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు రాఘవ్ ఛద్దా అభ్యంతరం వ్యక్తం చేశారు. డివిజన్ కావాలంటూ పట్టుబట్టారు. వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.
కాగా- వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కూడా.. బిల్లుకే అనుకూలంగా ఓటు వేశారు.












Click it and Unblock the Notifications