హస్తిన ఘర్షణలపై కేంద్రం సీరియస్..! ఢిల్లీ సీపీకి అమిత్ షా సమన్లు
న్యూఢిల్లీ : దేశరాజధానిలో గల చాందినీ చౌక్ లో రెండువర్గాల గొడవను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జరిగిన ఘటనపై ఢిల్లీ పోలీసు కమిషనర్ను వివరాలు అడిగింది. ప్రాథమికంగా ఢిల్లీ సీపీకి హోంశాఖ సమన్లు జారీచేసింది. పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని స్పష్టంచేసింది.
సీపీకి మందలింపు ..
రెండు వర్గాల ఘర్షణ చినికి.. చినికి గాలివానలా మారింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఇంటా, బయట విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలకు ఉపక్రమించారు. ఢిల్లీ సీపీ అమూల్య పట్నాయక్ను మందలించారు. ఈ మేరకు సమన్లు కూడా జారీచేశారు. జరిగిన ఘటనపై నివేదిక ఇవ్వాలని స్పష్టంచేశారు.

ఏం జరిగిందంటే..?
చాందినీ చౌక్లోని ఖ్వాజీలో పండ్ల వ్యాపారి సంజీవ్ గుప్తా, అస్ మహ్మద్ మధ్య పార్కింగ్ విషయమై ఘర్షణ జరిగింది. గుప్తా ఇంటిముందు మహ్మద్ కారు పార్కింగ్ చేయడంతో వివాదం చెలరేగింది. దీనిపై గుప్తా అభ్యంతరం వ్యక్తం చేయడంతో .. మహ్మద్ కొందరితో వచ్చి దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనిపై గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు మహ్మద్, మరికొందరిని అరెస్ట్ చేశారు. దీంతో మహ్మద్ మద్దతుదారులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఇదే ఘర్షణకు దారితీసిందని అధికారులు చెప్తున్నారు. తర్వాత చెలరేగిన అల్లర్లతో ఓ ప్రార్థనా మందిరం కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు కేంద్ర హోంశాఖకు రిపోర్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజీతో ఘటపతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications