'ప్రత్యేక హోదా నిరాకరణ క్రూయల్ జోక్, బిజెపిపై భగ్గు'
పాట్నా: భారతీయ జనతా పార్టీ పైన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు సీనియర్ నేత సోమవారం నాడు మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు దానిని ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా నిరాకరించడం ఓ క్రూరమైక్ జోక్ అని ఆయన అభివర్ణించారు. ప్రజలు తప్పకుండా ఈ నమ్మక ద్రోహాన్ని అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీహార్ ప్రజలకు ఇదొక క్రూరమైన జోక్ అని మండిపడ్డారు.
ఇప్పట్లో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని జులై 31న కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సెగ రాజుకుంది.
బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జెడియు, ఆర్జేడీలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నితీష్ పైవిధంగా స్పందించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే బీహార్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ ప్రసంగం రికార్డులను నిరంతరం ప్లే చేస్తూనే ఉంటామన్నారు.