మోడీకి వ్యతిరేక కూటమి సిద్ధం: సోనియా గాంధీతో డిప్యూటీ సీఎం భేటీ
న్యూఢిల్లీ: బిహార్లో జనతాదళ్ (యునైటెడ్)-రాష్ట్రీయ జనతాదళ్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావడానికి అవసరమైన పావులు- రెండో రోజు నుంచే కదలడం మొదలు పెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ సర్కార్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మరింత బలంగా కూటమి కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎన్డీఏ నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బయటికి రావడం ఒక ఎత్తయితే అనుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష కూటమికి ఆయనే నాయకత్వాన్ని వహించే అవకాశాలు రావడం మరో ఎత్తుగా భావిస్తోన్నారు. ఈ బాధ్యతను నితీష్ కుమార్ స్వీకరిస్తారా? లేదా? అనేది పక్కన పెడితే- ఎన్డీఏకు గుడ్బై చెప్పడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సైతం స్వాగతిస్తోంది. ఆయనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
కూటమి ప్రయత్నాల్లో భాగంగా ఆర్జేడీ అధినేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్.. ఈ సాయంత్రం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీని కలుసుకోనున్నారు. ఢిల్లీ 10 జన్పథ్ నివాసానికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు పార్టీ ఎంపీలు సోనియా గాంధీని కలుస్తారు. బిహార్లో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సోనియాకు వివరిస్తారు. నితీష్ కుమార్ను ప్రతిపక్షాల కూటమి చీఫ్గా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాలని కోరుతారని చెబుతున్నారు.
Recommended Video
ఇప్పటికే సోనియా గాంధీ.. తేజస్వి యాదవ్కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం బిహార్లో ఏర్పాటైన మహాకూటమి సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామ్యమైంది. ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు బేషరతుగా నితీష్ కుమార్కు మద్దతు ప్రకటించారు. అయినప్పటికీ త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్కూ చోటు లభించనుంది. ఎంతమందిని తీసుకుంటారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.