Nirbhaya Case: క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్, ఐనా దోషుల ఉరిశిక్షపై స్టేకు ఢిల్లీ కోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: 2012 నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో తమకు విధించిన మరణశిక్షపై స్టే విధించాలంటూ ఇద్దరు దోషులు చేసిన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తోసిపుచ్చింది. నిర్భయ కేసులో దోషులైన అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్స్ ఆధారంగా కోర్టును అభ్యర్తించారు.
అయితే, నిర్భయ దోషుల అభ్యర్థనను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. దీంతో మార్చి 3న ఉదయం నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలయ్యే అవకాశం ఉంది. పవన్ గుప్తా వేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో అడిషనల్ సెషన్స్ జడ్జీ ధర్మేంద్ర రాణా మరణశిక్షపై స్టే విధించాలంటూ నిర్భయ దోషులిద్దరు పెట్టుకున్న అభ్యర్థనను కూడా కొట్టిపారేశారు.
ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గరపడుతుండగా అక్షయ్ కుమార్ సింగ్ గత శుక్రవారం మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థనను పెట్టుకున్నాడు. కొత్తగా క్షమాభిక్ష పిటిషన్ వేసినందున డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలని కోరుతూ అక్షయ కుమార్ సిం్ కోర్టును ఆశ్రయించాడు. అయితే, కోర్టు ఇందుకు నిరాకరించింది. అక్షయ్ కుమార్ సింగ్ గతంలో క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకోగా.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
కాగా, ఉరితీతకు ఒక్క రోజు ముందు మరో దోషి పవన్ గుప్తా రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. దీనికి ముందు పవన్ క్యురేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో అతను తనకున్న చిట్టచివరి అవకాశమైన క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్ పాటియాల కోర్టుకు తెలిపారు.
అయినప్పటికీ కోర్టు దోషి అభ్యర్థనను తిరస్కరించింది. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ ఢిల్లీ కోర్టు దోషి అభ్యర్థనను తిరస్కరించడంతో దోషులు ఉరితీత ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రపతి.. నిర్భయ దోషి క్షమాభిక్ష పిటిషన్ను మరోసారి తిరస్కరించే అవకాశం ఉంది. 2012లో ఆరుగురు నిందితులు నిర్భయపై సామూహికంగా అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. రామ్ సింగ్ అనే నిందితుడు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా.. మరో నిందితుడు మైనర్ కావడంతో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు దోషులు అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్లకు కోర్టు మరణ శిక్ష విధించింది.