కరోనా స్ట్రెయిన్ : కేంద్రం సంచలనం -జనవరి 31 అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధం
బ్రిటన్ లో పుట్టుకొచ్చిన కొత్త రకం కరోనా వైరస్ భారత్ లోనూ వ్యాప్తి చెందడం పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్ట్రెయిన్ వైరస్ వ్యాప్తిని నివారించే దిశగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం బుధవారం నిషేధం విధించింది.
జనవరి 31వరకు అన్ని అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేదం విధిస్తున్నట్లు కేంద్ర సంస్థ 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)' బుధవారం ఒక ప్రకటన చేసింది. స్ట్రెయిన్ వైరస్ కలకలం నేపథ్యంలో భారత్ బ్రిటన్ మధ్య విమాన సేవలను ఈ నెల 23 నుంచి 31 వరకు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించిన డీజీసీఏ..

తన ఉత్తర్వులను మరోసారి సవరిస్తూ, బ్రిటన్ కు విమానాల నిషేధాన్ని జనవరి 7 వరకు పొడగిస్తున్నట్లు బుధవారం ఉదయం తెలిపింది. తిరిగి సాయత్రం మరోసారి సవరించిన ఉత్తర్వులను విడుదల చేసింది. జనవరి 31 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. అయితే, కార్గో సర్వీసులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
దేశంలో యూకే కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు బుధవారం నాటికి 20 కు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 6కేసులురాగా, బుధవారం ఒక్కరోజే ఏకంగా 14 కొత్త స్ట్రెయిన్ కేసులు రావడం గమనార్హం. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల్లో పాజిటివ్ గా తేలినవారందరి రక్తనమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్త స్ట్రెయిన్ కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలో ఎనిమిది, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో మిగతా కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications