బ్లాక్ మనీ వెల్లడించేందుకు మరో అవకాశం, హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశీయ నల్లధనం వెల్లడికి మరో అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే జూన్ నుంచి స్వచ్ఛంద వెల్లడికి నిర్దేశించిన బ్లాక్ మనీ విండోను ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా నల్లధనం వివరాలను వెల్లడించిన వారికి ఐటీ శాఖ నుంచి ఉపశమనం లభిస్తుంది.
జూన్ 1 నుంచి నాలుగు నెలలపాటు అంటే సెప్టెంబర్ 30 వరకు అక్రమ సొమ్ముపై 45 శాతం పన్ను చెల్లించి సక్రమంగా మార్చుకోవచ్చునని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ సొమ్ముపై ఎలాంటి జరిమానాను గాను, విచారణను గాను ఎదుర్కొవాల్సిన అవసరం లేదని తెలిపింది.
ఇన్కం డిక్లరేషన్ స్కీమ్ 2016 ప్రకారం సెప్టెంబర్ 30లోగా నల్లధనాన్ని బహిరంగంగా ప్రకటించకపోతే ఆ తర్వాత పన్నులు, సర్చార్జీ, జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది. ఆదాయ పన్ను చట్టప్రకారం ఆదాయం బహిర్గతం చేసిన వారిపై ఎలాంటి చర్యలు, ముఖ్యంగా విచారణ గానీ స్క్రూట్నీ చేయరాదు.
దేశీయంగా పన్ను ఎగనామం పెడుతున్న వారిని దృష్ట్యా ఆర్థిక మంత్రి జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన బడ్జెట్లో ఈ స్కీంను ప్రవేశపెట్టారు. గతంలో కేంద్ర ప్రభుత్వం విదేశాల్లో అక్రమంగా దాచి పెట్టిన ఆస్తులను వెల్లడించడానికి ఇలాంటి స్కీంను ప్రవేశపెట్టింది.
బహిర్గతం కాని పలు ఆస్తులపై పెట్టిన పెట్టుబడులు, ఇతర మార్గాల్లో ఇన్వెస్టులకు ఈ స్కీమ్ వర్తించనున్నది. ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా ఆస్తులను వెల్లడించాల్సి ఉంటుందని, లేదంటే జరిమానాతోపాటు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది.