హర్యానాలో కాంగ్రెస్ తప్పును ఢిల్లీలో రిపీట్ చేసి ఓడిపోయిన కేజ్రివాల్ ?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. హ్యాట్రిక్ పై కన్నేసిన కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై బీజేపీ విజయ ఢంకా మోగించింది. స్వయంగా కేజ్రివాల్ సైతం న్యూఢిల్లీ సీటులో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. వరుసగా మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రివాల్ ఇలా చిత్తుగా ఓడిపోవడం, ఆయన పార్టీ ఆప్ సైతం ఢిల్లీలో ఓడిపోవడంతో జాతీయ పార్టీగా మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగింది.
అయితే ఈ ఎన్నికల్లో ఆప్ ఓటమి వెనుక ఢిల్లీ లిక్కర్ స్కాం, ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పలు కారణాలు ఉన్నప్పటికీ వీటన్నింటినీ మించిన మరో కారణం కూడా కనిపిస్తోంది. అదే హర్యానా ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ తప్పిదాన్ని కేజ్రివాల్ ఢిల్లీ ఎన్నికల్లో రిపీట్ చేయడమే. ఇంతకీ ఆ తప్పిదం ఏంటో తెలుసా తోటి ఇండియా కూటమి భాగస్వామ పార్టీని కలుపుకోకుండా ఒంటెద్దు పోకడలకు వెళ్లడమే. ఇంతకీ గతంలో హర్యానా ఎన్నికల్లో ఏం జరిగిందో ఓసారి చూద్దాం..

గతేడాది జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుందని అంతా భావించారు. అప్పటికే రెండుసార్లు ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీపై ఉన్న వ్యతిరేకత కచ్చితంగా కాంగ్రెస్ కు కలిసి వస్తుందని, రైతులు, రెజ్లర్ల ఆందోళనలు గెలిపిస్తాయని అంచనా వేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ ఇండియా కూటమి భాగస్వామి, పొరుగు రాష్ట్రమైన పంజాబ్ లో అధికార పార్టీ ఆప్ ను కలుపుకుని వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. చివరకు ఇదే బీజేపీకి కలిసి వచ్చి అక్కడ హ్యాట్రిక్ కొట్టేసింది.
ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్ధానంలో ఆప్, ఆప్ స్ధానంలో కాంగ్రెస్ వచ్చాయి. ఏమాత్రం అంచనాల్లోకుండా బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ను కలుపుకునేందుకు బలంగా ఉన్నామని భావించిన ఆప్ నిరాకరించింది. గత లోక్ సభ ఎన్నికల్లో వీరిద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ఫలితం ఇవ్వకపోవడంతో ఒంటరి పోరుకే కేజ్రివాల్ మొగ్గు చూపారు. కానీ అదే ఆప్ ను ముంచింది. ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఆప్.. కేవలం మూడు శాతం ఓట్లతో వెనుకబడినా సీట్ల విషయంలో మాత్రం పూర్తిగా వెనుకబడింది. అదే కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే నాలుగుశాతం ఓటు బ్యాంక్ పెంచుకుని దాదాపు 7 శాతం ఓట్లు సాధించింది. సీట్ల ఖాతా తెరవకపోయినా ఆప్ ఓట్లకు భారీగా గండికొట్టేసింది. దీని ఫలితమే కేజ్రివాల్, సిసోడియా వంటి ఆప్ అగ్రనేతల స్వల్ప తేడా ఓటములని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications