కార్పొరేట్ పరం చేస్తున్నారు: మోడీపై దిగ్విజయ్, టిలో అమిత్షా పర్యటన
రాంఛీ: ప్రధాని నరేంద్ర మోడీ బొగ్గు రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఆయన రాంఛీలో గురువారం మాట్లాడుతూ.. బొగ్గు రంగాన్ని ప్రైవేటు పరం చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ చర్య.. ఇందిర పాలనకు ముందున్నటువంటి కార్మిక శక్తి దోపిడీ తాలూకు చేదు జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉందని అన్నారు.
బొగ్గు రంగంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. ‘మేక్ ఇన్ ఇండియా' అంటూనే బొగ్గు రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని మోడీ చూస్తున్నారని ఆరోపించారు. లక్షల మంది కార్మికులపై దోపిడీకి పాల్పడటాన్ని ప్రైవేటు రంగం ఆపాలని దిగ్విజయ్ సింగ్ కోరారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బొగ్గు పరిశ్రమను జాతీయం చేసి పేద, ఆదివాసులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని చెప్పారు. ఇప్పుడు ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు మళ్లీ అదే దోపిడీకి దారి తీస్తాయని దిగ్విజయ్ హెచ్చరించారు.
తెలంగాణలో అమిత్ షా పర్యటన ఖరారు
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. 27న వరంగల్లో జిల్లా అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. 28న హైదరాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో విడివిడిగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు తెలిపారు.