కెసిఆర్పై సోనియాకు చెప్తా: దిగ్విజయ్ శాంతి మంత్రం
హైదరాబాద్: కాంగ్రెస్లో విలీనం లేదంటూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర్రావు చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ శాంత పరుస్తున్నారు. ప్రస్తుత తరుణంలో కాస్త సంయమనం పాటించాలని, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా మార్గనిర్దేశం మేరకు ముందుకు సాగుదామని సూచిస్తున్నారు.
మంగళవారం మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీధర్బాబు, సుదర్శన్రెడ్డి, షబ్బీర్ అలీ, భాను ప్రసాద్ తదితరులు సమావేశమయ్యారు. విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలపై, తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలోచర్చించారు. పొత్తులు కోరుకునే పార్టీలు ముందుగా తమ పార్టీ కమిటీని కలవాలని కెసిఆర్ చెప్పడం ఇతర రాజకీయ పార్టీలను అవమానించేదిగా ఉందని ఎమ్మెల్సీ భాను ప్రసాద్, షబ్బీర్ అలీ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్తో షబ్బీర్, జానారెడ్డి ఫోన్లో మాట్లాడారు. కెసిఆర్ వ్యాఖ్యలను, దిగ్విజయ్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ విషయాలన్నింటినీ సోనియా దృష్టికి తీసుకువెళ్తానని, అంతవరకు సంయమనం పాటించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దిగ్విజయ్ సూచించారు.
తెరాసతో కాంగ్రెస్ సంబంధాల గురించి ప్రస్తుతానికి మరిచిపోయి ప్రజల్లోకి వెళ్లాలని, మునిసిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు దిగ్విజయ్ చెప్పారు. రెండు ప్రాంతాల్లోనూ ఒకటి రెండు రోజుల్లోనే పిసిసిలను ఏర్పాటు చేస్తామని, దీనిపై సోనియాతోనూ చర్చించామని తెలిపారు.
తెలంగాణలో సోనియా, రాహుల్ పర్యటన తేదీలను కూడా త్వరలో ఖరారు చేస్తామని ఆయన చెప్పారు. సోనియాకు తెలంగాణ ప్రజలు కృతజ్ఞతలు చెప్పేందుకు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యులు దిగ్విజయ్కు విజ్ఞప్తి చేశారు.