దినకరన్ గెలుపు: జయ కోటలో శశికళ పాగా, తమిళ రాజకీయాల్లో మార్పులు?
చెన్నై: ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి టీటీవి దినకరన్ 40 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం తమిళనాడు రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కె నగర్లో దినకరన్ విజయం సాధించడం ద్వారా చిన్నమ్మ శశికళ పట్టు సాధించారనే చర్చ కూడ సాగుతోంది.
ఆర్ కె నగర్ ఉప ఎన్నికలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రభావాన్ని చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు ఎన్నికల ఫలితాలు పూర్తవకముందే మూడు మాసాల్లోనే ప్రభుత్వం కూలిపోతోందని దినకరన్ చేసిన సంచలన వ్యాఖ్యలను రాజకీయ విశ్లేషకులు ఇందుకు కారణంగా చూపుతున్నారు.
ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో డిఎంకె అభ్యర్థి డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యానికి గురిచేసింది. అన్నాడిఎంకెకు బాగా పట్టున్న ఆర్కె నగర్ ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి దినకరన్ విజయం సాధించడం ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

అమ్మ కోటలో చిన్నమ్మ పాగా
ఆర్ కె నగర్ ఉప ఎన్నికల ఫలితాలు తమిళనాడులోని పాలక అన్నాడిఎంకెకు దిమ్మతిరిగేలా చేశాయి. అధికారంలోకి ఉండి కూడ ఇండిపెండెంట్ అభ్యర్థి దినకరన్ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నేతల్లో అంతర్మథనానికి కారణమైంది. దినకరన్ ఊహించని మెజారిటీతో విజయం సాధించారు. అన్నాడిఎంకె అభ్యర్థిపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం సాధారణ విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అదే సమయంలో ఆర్కె నగర్ ఎన్నికల్లో దినకరన్ కంటే ముందుగా రెండు దఫాలు జయలలిత ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. దినకరన్ ఈ స్థానంలో విజయం సాధించడం ద్వారా అమ్మ కోటలో చిన్నమ్మ పాగా వేసినట్టైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పనున్న దినకరన్
తమిళనాడు రాజకీయాల్లో దినకరన్ చక్రం తిప్పే అవకాశం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శిగా శశికళ ఉన్న సమయంలో జైలుకు వెళ్ళే ముందు అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్కు పట్టం కట్టారు. అయితే పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకం కావడంతో శశికళతో పాటు దినకరన్ను పార్టీ నుండి బయటకు పంపారు. అయితే దినకరన్ వెంట కూడ కొంత మంది ఎమ్మెల్యేలున్నారు. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత దినకరన్ తమిళనాడు రాజకీయాల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు లేకపోలేందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వాన్ని మూడుమాసాల్లో కూలిపోతోందని దినకరన్ చేసిన సంచలన ప్రకటన రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణంగా మారింది.

దినకరన్కు శుభాకాంక్షలు తెలిపిన 10 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు
దినకరన్ విజయం సాధించిన తర్వాత సుమారు 10 మంది అన్నాడిఎంకె ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారని సమాచారం. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన ఎంపీ ఒకరు దినకరన్ ఇంటికి వెళ్ళడం కూడ చర్చనీయాంశంగా మారింది. అయితే తమిళనాడు రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారే అవకాశాలు మాత్రం లేకపోలేదు.

అన్నాడిఎంకె సమీక్ష
ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓటమి విషయమై ఆ పార్టీ సమీక్ష నిర్వహించనుంది. పన్నీర్ సెల్వం, పళని స్వామిల నేతృత్వంలో అన్నాడిఎంకె నేతలు ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహించనున్నరు. సోమవారం నాడు ఈ విషయమై సమీక్ష జరిపే అవకాశం ఉందంటున్నాయి ఆ పార్టీ వర్గాలు.మరో వైపు దినకరన్ ఎత్తుగడలను తిప్పికొట్టేలా వ్యూహరచన చేయాల్సిన అవసరం అన్నాడిఎంకెపై అనివార్యంగా ఉంది.












Click it and Unblock the Notifications