100/117 గెలుస్తామనుకుంటే.. ఇలాంటి ఫలితాలా?, ఊహించలేదు: ఆప్
పంజాబ్ లో వచ్చిన ఫలితాలను పున:సమీక్షించుకుంటామని, ఇలాంటి ఫలితాలను ఊహించలేదని ఆప్ మంత్రి కపిల్ మిశ్రా పేర్కొన్నారు.
ఢిల్లీ: అటు పంజాబ్ ఇటు గోవా.. గెలుస్తామన్న ధీమాతో బరిలో దిగిన ఆప్ కు ఈ రెండు రాష్ట్రాల్లోను ఎదురుదెబ్బే తగిలింది. పంజాబ్ లో రెండో స్థానంతో సరిపెట్టుకుంటే గోవాలో ఖాతా కూడా తెరవని పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల్లోను ఆప్ పై కాంగ్రెస్ దే పైచేయి అయింది.
ఈ నేపథ్యంలో ఆప్ వర్గాలు ఆలోచనలో పడ్డాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు తమను నిరాశపరిచాయమని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశించిన తమకు, వచ్చిన ఫలితాలు నిరాశకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. అయితే ఆప్ ను తక్కువ అంచనా వేయవద్దని ఆయన సూచించారు.
రాష్ట్రంలో కొత్తగా పోటీ చేసిన పార్టీ రెండో స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. అదే సమయంలో ఫలితాలను పున:సమీక్షించుకుంటామని, ఇలాంటి ఫలితాలను ఊహించలేదని ఆప్ మంత్రి కపిల్ మిశ్రా పేర్కొన్నారు. పంజాబ్ లో 117స్థానాలకు 100స్థానాలు గెలిచి తీరుతామనుకుంటే.. అంచనాలు తారుమారయ్యాయని అన్నారు.
కాగా, పంజాబ్ లో కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకోగా.. ఆప్-20, అకాళీదళ్+బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుచుకున్నాయి.