బీజేపీకి దిమ్మతిరిగే ప్లాన్ చేస్తున్న సీఎం, డీకే, అదే జరిగితే రివర్స్ గేమ్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. బీజేపీలో గతంలో బీఎస్. యడియూరప్ప క్రియాశీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయనతో ఆపరేషన్ కమల భయంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు హడలిపోయారు. ప్రత్యక్ష రాజకీయాలకు ఇప్పుడు యడియూరప్ప దూరం కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ హస్తం పేరును తెరమీదకు తెచ్చింది.
రానున్న రోజుల్లో కర్ణాటకకు చెందిన కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శిబిరంలోకి వచ్చే అవకాశం ఉందని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరు రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు, బీబీఎంపీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని విదాలుగా లాభం పొందాలని ప్లాన్ చేస్తున్నది.

ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
2019లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు బీజేపీ టిక్కెట్లతో ఎమ్మెల్యేలు అయిన ఆ ఎమ్మెల్యేలు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అప్పట్లో కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలు ఆపరేషన్ కమలలో భాగంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహకరించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరి ప్రస్తుతం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అయిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీలో చర్చలు జరుగుతున్నాయని తెలిసింది.
బెంగళూరు నగరంలోని యశ్వంతపురం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ. సోమశేఖర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కొద్ది రోజుల క్రితం నగరంలోని కెంపేగౌడ లేఅవుట్ను పరిశీలించిన సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే. శివకుమార్తో కలిసి బీజేపీ ఎమ్మెల్యే సోమశేఖర్ వేదిక మీదకు వచ్చారు.
ఈ కార్యక్రమంలో సోమశేఖర్ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి సహకరించిన శివకుమార్ తనకు గురువు అని బీజేపీ ఎమ్మెల్యే ఎస్,టీ, సోమశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమశేఖర్తో పాటు 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు 2019లో సంకీర్ణ ప్రభుత్వానికి రాజీనామా చేశారు.

ఇంతకుముందు జేడీఎస్ లో ఉన్న గోపాలయ్యను మినహాయించి మిగిలిన వారు ఇంతకు ముందు కాషాయ పార్టీలోకి మారకముందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్తో చర్చలు జరిపారని తెలిసింది. వీరు అందరూ కాంగ్రెస్లోకి తిరిగి వచ్చే అవకాశం గురించి చర్చలు జరిపారని తెలిసింది. ఇదే జరిగితే లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ పడే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications