తేల్చుకుంటామన్న స్టాలిన్- వెనక్కి తగ్గిన గవర్నర్: ఆ ఉత్తర్వులు అబెయన్స్లో
చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి ఊరట దక్కింది. విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీని బర్తరఫ్ చేస్తూ జారీ అయిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. వాటిని అబెయన్స్లో పెట్టారు. ఈ ఉత్తర్వులపై న్యాయస్థానంలో తేల్చుకుంటామంటూ స్టాలిన్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది.
సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇటీవలే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే కారణంతో ఈడీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన విచారణను ఎదుర్కొంటోన్నారు. గతంలో చెన్నై, కోయంబత్తూరు, కరూర్.. వంటి ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేశారు.

సెంథిల్ బాలాజీ పర్యవేక్షిస్తోన్న మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఆయనకు సన్నిహితంగా ఉండే వారిని టార్గెట్ చేశారు. అప్పట్లో స్వాధీనం చేసుకున్న కొన్ని కీలక డాక్యుమెంట్ల ఆధారంగా సెంథిల్ బాలాజీ.. మనీ లాండరింగ్కు పాల్పడినట్లు నిర్ధారించారు. ఆయనను అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ను డీఎంకే తప్పుపట్టింది. రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించింది.
ఆ తరువాత ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ రాత్రి 8 గంటల సమయంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఎదుర్కొంటోన్న దశలో మంత్రిగా కొనసాగితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని గవర్నర్ భావించారు. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

దీనిపై స్టాలిన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మంత్రివర్గ సభ్యుడిని బర్తరఫ్ చేసే హక్కు గవర్నర్కు లేదని తేల్చి చెప్పారు. సెంథిల్ బాలాజీ తొలగింపు వ్యవహారంపై న్యాయస్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు. గవర్నర్కు ఏ రకంగానూ హక్కులు లేవని, దీన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు. ఆ తరువాత గవర్నర్ వెనక్కి తగ్గారు. ఆ ఉత్తర్వులను అబెయన్స్లో పెడుతున్నట్లు రాజ్ భవన్ తెలిపింది. అటార్నీ జనరల్ను అభిప్రాయాన్ని తీసుకుంటామని పేర్కొంది.












Click it and Unblock the Notifications