క్యాప్టెన్ ను ఆహ్వానించిన కరుణానిధి
చెన్నై: డీఎంకేతో దోస్తీకి ముందుకు వచ్చి వచ్చే శాసన సభ ఎన్నికల్లో పోటి చెయ్యాలని డీఎంకే అధినేత ఎం. కరుణానిధి స్వయంగా డీఎండీకే అధినేత క్యాప్టెన్ విజయ్ కాంత్ కు ఆహ్వానం పలికారు. అయితే విజయ్ కాంత్ వారికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నారు.
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో కసరత్తులకు శ్రీకారం చుట్టింది. డీఎండీకేను తమ వైపుకు తిప్పుకోవడానికి డీఎంకే శక్తి వంచన లేకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. ఇంత కాలం డీఎంకే నాయకులు విజయ్ కాంత్ తో చర్చలు జరిపారు.
అయితే ఇప్పుడు ప్రజాకూటమి విజయ్ కాంత్ ను తమ కూటమిలోకి లాక్కోవడానికి ప్రయత్నించడంతో డీఎంకే నాయకులు వారి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. డీఎంకే అధినేత ఎం. కరుణానిధి ఒక మెట్టుదిగి స్వయంగా విజయ్ కాంత్ కు ఆహ్వానం పలికారు.
బుధవారం అరివాలయంలో డీఎంకే అధినేత ఎం. కరుణానిధి డీఎంకే మేనిఫెస్టో కమిటీతో భేటీ అయ్యారు. తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన తాము విజయ్ కాంత్ ను ఆహ్వానిస్తున్నామని, మాతో దోస్తీకి ఆయన ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ప్రజాకూటమి నాయకులు ఇటీవల విజయ్ కాంత్ తో భేటీ అయ్యారు కదా అని మీడియా ప్రశ్నించగా అందుకు సమాధానం చెప్పడానికి కరుణానిధి నిరాకరించారు. మొత్తం మీద అన్ని పార్టీల నాయకులు క్యాప్టెన్ విజయ్ కాంత్ తో దోస్తీకి పోటీ పడుతున్నారు.