ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు.. ఎంకే స్టాలిన్ సంచలనం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ఎప్పుడైనా అసెంబ్లీ ఎన్నికలు రావచ్చని.. కేవలం 3 లేదా 6 నెలల్లోనే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. చెన్నైలో ఆదివారం జరిగిన ఓ భారీ చేరికల కార్యక్రమంలో స్టాలిన్ ప్రసంగించారు. మాజీ మంత్రి బెంజమిన్ నేతృత్వంలో ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా డీఎంకేలో చేరారు. ఈ వేదికపై విజయ్ సర్కారును టార్గెట్ చేస్తూ ఎంకే స్టాలిన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వాన్ని ఓ బలహీనమైన మైనారిటీ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు.
ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఒంటరిగా ప్రభుత్వాన్ని నడిపే ప్రజా తీర్పు రాలేదని స్టాలిన్ గుర్తు చేశారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 సీట్లు కాగా.. విజయ్ పార్టీ కేవలం 108 స్థానాలను మాత్రమే గెలుచుకుందని ఎంకే స్టాలిన్ స్పష్టం చేశారు. "మనం వాస్తవాలను పరిశీలించాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ తన సొంత బలంతో ఓ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని సాధించలేకపోయింది" అంటూ ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.

గతంలో డీఎంకే కూటమిలో ఉండి.. ఎన్నికల వ్యూహాల్లో భాగంగా చివరి నిమిషంలో విజయ్ వైపు మొగ్గు చూపిన పార్టీల మద్దతుతోనే ఈ ప్రభుత్వం నడుస్తోందని స్టాలిన్ ఆరోపించారు. ప్రజలు డీఎంకే ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఓట్లేసిన కొన్ని పార్టీల అండతోనే టీవీకే బండి సాగుతోందని ఆయన వెల్లడించారు. "ఇది చాలా బలహీనమైన ఏర్పాటు. ఈ ప్రభుత్వ వాహనం ఏ మలుపులో బ్యాలెన్స్ కోల్పోయి అకస్మాత్తుగా ఆగిపోతుందో ఎవరికీ తెలియదు. అందుకే నేను చెబుతున్నాను.. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. అది 3 నెలల్లో కావచ్చు లేదా 6 నెలల్లో కావచ్చు. మనం ఐదేళ్ల పూర్తి కాలం వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు" అని చెబుతూ పార్టీ శ్రేణులను తక్షణమే ఎన్నికల మోడ్లోకి వెళ్లాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
గత ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంల్ వంటి పార్టీలు డీఎంకే కూటమి నుంచి విడిపోయి విజయ్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంకే స్టాలిన్ స్పందిస్తూ.. "మనం ఎలాంటి రాజకీయ పరిణామాలకైనా 100 శాతం సిద్ధంగా ఉండాలియ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత ప్రిపరేషన్లు మొదలుపెట్టలేం. ఈ భారీ చేరికల కార్యక్రమమే డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడానికి క్షేత్రస్థాయి పనులను ప్రారంభించే శుభతరుణం కావాలి" అని ఎంకే స్టాలిన్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇది మాత్రమే కాకుండా గత నెల రోజులుగా తమిళనాడు అభివృద్ధి పథం నుంచి పక్కకు జరిగిందని.. పెట్టుబడిదారులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని.. మహిళలపై నేరాలు, డ్రగ్స్, దొంగతనాలు, విద్యుత్ కోతలు పెరిగిపోయాయని మండిపడ్డారు.
మరోవైపు డీఎంకే యువనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కూడా టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పుదుక్కోట్టైలో జరిగిన ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన.. తమిళనాడులో గతంలో ఉన్న సుపరిపాలన ఎటు పోయిందోనని ప్రజలు వెతుక్కునే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం డీఎంకే నాయకులపై తనిఖీలు చేయడానికే ప్రాధాన్యత ఇస్తోందని.. అవినీతి శక్తులను తమ పార్టీలో చేర్చుకుని పవిత్రులుగా మారుస్తోందని ఆరోపించారు. సీఎం విజయ్కు పాలన కంటే అసెంబ్లీలో కెమెరా యాంగిల్స్, సిట్టింగ్ పొజిషన్లపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని.. ప్రతిరోజూ ఆయన అక్కడ ఒక సినిమా షూటింగ్ తరహాలో ప్రదర్శన ఇస్తున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications