ఇజ్రాయెల్, ఇరాన్లకు వెళ్లొద్దు: భారత పౌరులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ
న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ లకు ప్రయాణం చేయవద్దని భారత పౌరులకు సూచించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ తమ సూచనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చనే వార్తలు వస్తున్న క్రమంలో విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీని జారీ చేసింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదా ఇరాన్ లో ఉంటున్న వారు స్థానిక భారత రాయబార కార్యాలయంతో టచ్లో ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. అక్కడ తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపింది. పౌరులు తమ భద్రతపై జాగ్రత్తలు పాటించాలని, బయటి కార్యకలాపాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని సూచించింది.

ప్రతీతికారంతో రగిలిపోతున్న ఇరాన్
డమాస్కస్ లోని తమ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ దళానికి చెందిన ఏడుగురు జనరల్స్ మృతి చెందారు. దీన్ని తీవ్రంగా పరగణించిన ఇరాన్.. దీనికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తోంది. అంతేగాక, వారిని శిక్షిస్తామని ప్రకటనలు కూడా చేసింది.
ఈ క్రమంలోనే ఇరాన్ నేరుగా దాడులు చేయకపోయినప్పటికీ.. లెబనాన్ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్ బొల్లా, ఇతర మిలిటెంట్ సంస్థలతో ఇజ్రాయెల్ పై దాడులు చేయించొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయ్యింది.












Click it and Unblock the Notifications